లీక్ పేపర్ అమ్మకాల విలువ 15 కోట్లు
![లీక్ పేపర్ అమ్మకాల విలువ 15 కోట్లు](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_6481678437fec.jpg)
- విచారణలో సిట్ దూకుడు
- డీఈ రమేశ్ అరెస్ట్తో కొత్త మలుపు
- వేగంగా కదులుతున్న అధికారులు
- వచ్చే వారం కోర్టులో చార్జ్షీట్
- తొలి రిపోర్టులో 37 మందిపై అభియోగాలు
- ఈడీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
టీఎస్పీఎస్పీ ప్రశ్నపత్రాల లీకేజీలో కొనుగోళ్లు కోట్లు దాటిపోయాయి. ఈ కేసులో ఇప్పటి వరకు 50 మందిని అరెస్ట్ చేయగా, డీఈ పూల రమేశ్ ద్వారానే పెద్ద ఎత్తున వ్యాపారంగా సాగినట్లు తేలింది. ఏఈ, డీఏఓ పరీక్షా పత్రాల అమ్మకాల ద్వారానే పూల రమేశ్రూ.13 కోట్లకుపైగా వసూలు చేసినట్లు సిట్అనుమానిస్తున్నది. దీనికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఈ వ్యవహారంపై హైకోర్టుకు నివేదిక ఇచ్చిన సిట్ నాంపల్లి కోర్టులో ఇంకా అభియోగ పత్రాలు దాఖలు చేయలేదు. ఈ వారంలో విచారణను కొలిక్కి తీసుకువచ్చి వచ్చేవారంలో చార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. 37 మంది నిందితులుగా చేర్చనున్నారు. ఇప్పటికే ఈ కేసుపై ఈడీ విచారణ మొదలుపెట్టి నివేదిక కోసం కోర్టుకెళ్లిన విషయం తెలిసిందే. నిందితులను, టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రెటరీని ఈడీ విచారించింది. ఈడీ విచారణ సమయానికి రూ. 39 లక్షలు మాత్రమే చేతులు మారినట్లుగా సిట్ వెల్లడించింది. దీంతో ఈడీ కొంత బ్యాక్ స్టెప్ వేసింది. కానీ, ఇప్పుడు కొనుగోళ్ల వ్యవహారం కోట్లు దాటడంతో ఈడీ రీ ఎంట్రీ ఇవ్వనుంది. మనీ లాండరింగ్ కేసుగా మళ్లీ విచారణ చేయాలని భావిస్తున్నారు. సిట్ స్థానిక కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేయగానే ఈడీ రీ ఎంట్రీ అవుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
రూ.16 కోట్ల వ్యాపారం
ఉద్యోగ నియామక ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కమిషన్ఉద్యోగి ప్రవీణ్నుంచి ప్రధాన నిందుతులు రేణుక, ఆమె భర్త ఢాకూ నాయక్ రూ.10 లక్షలకు పేపర్లు కొనుగోలు చేసిన విషయం బయటకు వచ్చింది. ఆ తర్వాత దాన్ని ఇతరులకు అమ్మారు. ఈ వ్యవహారంలో మొత్తం రూ. 39 లక్షలు చేతులు మారినట్లుగా సిట్ వారం కిందట వరకు రిపోర్ట్లో పేర్కొన్నది. కానీ, డీఈ పూల రమేశ్ అరెస్ట్ తర్వాత విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏఈ పరీక్ష సందర్భంగా ఎలక్ట్రానిక్ డివైజెలు ఉపయోగించి, పరీక్ష రాయించినందుకే రూ. 2.50 కోట్లకు ఏడుగురు అభ్యర్థుల నుంచి బేరం కుదుర్చుకున్నట్లు తేలింది. ఆ తర్వాత డీఏఓ, ఏఈ పేపర్ లీకు కావడం, కమిషన్ లో ఉద్యోగం చేస్తున్న సురేశ్తో పరిచయం, ప్రశ్నపత్రాలు బయటకు రావడంతో డీఈ రమేశ్ భారీ బేరాలకు దిగారు. ఒక్కో పేపర్ను రూ. 10 లక్షల నుంచి రూ. 13 లక్షలకు అమ్మేందుకు సిద్ధమయ్యారు. ఇలా ఏకంగా 80 మందికిపైగా ప్రశ్నపత్రాలను అమ్మినట్లు తేలింది.
80 మంది ఎవరెక్కడ!?
డీఈ రమేశ్ను కస్టడీకి తీసుకున్న సిట్ఇప్పుడు 80 మంది వివరాల కోసం జల్లెడ పడుతున్నది. చాలా విషయాలు రమేశ్ దాస్తున్నట్లు సిట్అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 80 మందికి ఏఈ, డీఏఓ పేపర్ను విక్రయించినట్లు చెప్పడంతో వారి కోసం వెతుకుతున్నారు. వీరిలో కొంతమందిని సిట్ గుర్తించినట్లు తెలుస్తున్నది. ఒకేసారి వీరందరినీ అరెస్ట్చేసే అంశాలపై పరిశీలన చేస్తున్నారు. ఇప్పటి వరకు కొంతమంది రూ. 13 లక్షలకుపైగా ఇచ్చి ప్రశ్నపత్రాలను కొన్నామని సిట్ పోలీసుల ముందుకు ఒప్పుకుంటున్నట్లు సమాచారం. ఈ లెక్కన ప్రశ్నపత్రాల కేసులో రూ. 16 కోట్లకుపైగా వ్యాపారం సాగినట్లు స్పష్టమవుతున్నది.
వచ్చేవారంలో చార్జ్షీట్
ఈ కేసుపై సిట్ ఇంకా చార్జ్షీట్ దాఖలు చేయలేదు. హైకోర్టుకు సీల్డ్ కవర్నివేదికనుమాత్రమే ఇచ్చింది. స్థానిక కోర్టులో ఇంకా చార్జ్షీట్ దాఖలు చేయలేదు. వచ్చేవారంలో సిట్ విచారణ పూర్తి నివేదికతో చార్జ్షీట్ దాఖలు చేయనున్నది. ఇందులో 37 మందిపై తొలుత అభియోగాలు మోపనున్నట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత అనుబంధ చార్జ్షీట్లో డీఈ రమేశ్, 80 మంది వివరాలను సమర్పించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఈడీకి చాన్స్
ఇప్పటికే ఈ కేసుపై ఈడీ రంగంలోకి దిగినా.. ఆర్థిక లావాదేవీలు లక్షల్లో ఉండటం, ఇటు సిట్ కూడా సహకరించకపోవడంతో.. వెనక్కి తగ్గింది. కానీ, సిట్ చార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఈడీ మళ్లీ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. మనీలాండరింగ్ కేసుగా విచారణకు దిగనున్నది. అంతేకాకుండా కోట్లలో లావాదేవీలు సాగడంతో.. ఈడీకి మరింత బలం చేకూరినట్లుగా మారింది. సిట్ దాఖలు చేసే చార్జ్షీట్ కోసం ఈడీ ఎదురుచూస్తున్నది.