ఘనంగా గట్టుప్పల మండలం మొదటి ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా గట్టుప్పల మండలం మొదటి ఆవిర్భావ దినోత్సవం

ముద్ర ప్రతినిధి, నల్గొండ:-గట్టుప్పల్ మండలంగా ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా అక్టోబర్ 2న మొదటి ఆవిర్భావ దినోత్సవం వేడుకలను గట్టుప్పల్ మండల సాధన సమితి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొని సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. గాంధీ జయంతి సందర్భంగా ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గట్టుప్పల్ మండల సాధన సమితి కన్వీనర్, ఉద్యమ నాయకులు ఇడం కైలాసం మాట్లాడుతూ 33 ఏళ్ల గట్టుప్పల మండల ప్రజల ఆకాంక్ష గట్టుపల మండల సాధన సమితి ఉద్యమంతో నెరవేరిందన్నారు.

అనునిత్యం ఉద్యమంలో ఉండి నిరంతరంగా 982 రోజులు ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ సోదరులకు ఏమిచ్చినా తక్కువేనని, అందరి కృషి ఫలితమే గత సంవత్సరం ఇదే రోజు మండలాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల తహసిల్దార్ లావణ్య మాట్లాడుతూ మండల ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని, మండల కేంద్రం ఏర్పాటు కావడం వల్ల నేడు రెవెన్యూ సేవలు ప్రజలకు చేరువయ్యాయన్నారు. మిగతా కార్యాలయాలు వచ్చే విధంగా ప్రభుత్వానికి నివేదికలు పంపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుమారి ఇడం రోజా, జిఎంఎస్ఎస్  నాయకులు బిమగని మల్లేశం, రాపోలు సత్తయ్య, మోదుగు బాల్ రెడ్డి, బిపిఎల్ గౌడ్, పున్న కిషోర్, పేదగానీ రాఘవేంద్ర, చేరిపల్లి రమేష్ నేత, నల్లబెల్లి రమేష్, మధాగాని సత్తయ్య, యాదయ్య, రమశంకర్, బానవత్ ధర్మ నాయక్, పిసికే రాంబాబు, బిమనపల్లి సత్తయ్య, తిమ్మయ్య, బోలేపల్లి శివ, ఐలయ్య, పులిపాటి వెంకటేశ, పన్న రమేష్, శంకరయ్య, మరయ్య, పాల్గొన్నారు.