ఢీ అంటే ఢీ వేదిక అదే .. గ్యాప్ 3 రోజులే
![ఢీ అంటే ఢీ వేదిక అదే .. గ్యాప్ 3 రోజులే](https://mudranews.in/uploads/images/2023/01/image_750x_63d016d57cd02.jpg)
- సచివాలయం ప్రారంభోత్సం తర్వాత బహిరంగ సభ
- జాతీయ నేతలతో కేసీఆర్ రెండో మీటింగ్
- జన సమీకరణ మీదనే అధిక దృష్టి
- మంత్రి కేటీఆర్ సభకుహాజరవుతారా?
ముద్ర, తెలంగాణ బ్యూరో : కేసీఆర్ జాతీయ రాజకీయాల వ్యూహాలు వేగంగా కదులుతున్నాయి. ఖమ్మం వేదికగా తొలి బహిరంగ సభను నిర్వహించి, జాతీయ నేతలతో బీజేపీ పై దూకుడు పెంచిన కేసీఆర్.. ఇప్పుడు మోడీ తరహాలోనే మరో సభకు సిద్ధమయ్యారు. వచ్చేనెల 13న ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చి, రైల్వే ఆధునీకరణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసి, పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇదే వేదికను బీఆర్ఎస్ కూడా ఎంచుకుంది. మోడీ సభ జరిగిన ప్రాంతంలోనే తమ బలాన్ని నిరూపించుకునేందుకు వ్యూహం వేసింది. గతంలో బీజేపీ ఓ చోట సభ పెడితే.. కేసీఆర్ మరో చోట నిర్వహించేవారు. కానీ, ఇప్పుడు ఒకే వేదికపైనా నాలుగు రోజుల వ్యవధిలోనే బల నిరూపణకు దిగుతున్నారు.
సభ ద్వారానే సంకేతం
రాష్ట్రంలో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తుంటే.. బీఆర్ఎస్ మాత్రం ఇతర రాష్ట్రాల నేతలను కూడదీస్తోంది. ఆయా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలతో కేసీఆర్ భారీ వ్యూహాలే వేస్తున్నారు. ఖమ్మం వేదికగా తొలి సభను నిర్వహించగా, ఈ సభకు ఢిల్లీ, పంజాయ్, కేరళ సీఎంలు, యూపీ మాజీ సీఎం, సీపీఐ జాతీయ నేతలను తీసుకువచ్చారు. ఆయా రాష్ట్రాలలో ఉన్న పరిస్థితులను వివరిస్తూనే.. అంతా యాంటీ బీజేపీ స్లోగన్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ ను ముందుంచి పోరాటం చేస్తామనే సంకేతాలిచ్చారు. ఇదే సమయంలో రాష్ట్రంలో బీజేపీ మరింత జోరు పెంచింది. కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు రాష్ట్రానికి బాట పట్టారు. ప్రధాని మోడీ కూడా వచ్చేందుకు టూర్ ఖరారైంది. దీంతో బీఆర్ఎస్ మరింత ముందడుగు వేస్తోంది. బీజేపీ మాత్రమే రాజకీయ ప్రత్యర్థి అంటూ ఈసారి మోడీ సభను టార్గెట్ చేసింది. అయితే, ఖమ్మం సభకు కొంతమంది నేతలు గైర్హాజరు కావడంతో బీఆర్ఎస్ కు మద్దతు తగ్గిందంటూ బీజేపీ ప్రచారానికి దిగింది. దీంతో తొలి బహిరంగ సభకు గైర్హాజరైన నేతలను ఈసారి రాష్ట్రానికి తీసుకువస్తున్నారు. దీంతో జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ బలం పెరుగుతుందనే సంకేతాన్ని కేసీఆర్ ఇవ్వనున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
పుట్టిన రోజునాడే
సీఎం కేసీఆర్ పుట్టినరోజు ఫిబ్రవరి 17 సందర్భంగా రెండు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు తమిళనాడు సీఎం స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహర్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, బిహర్ సీఎం నితీశ్ తరుపున ప్రతినిధిగా జేడీయూ అధ్యక్షుడు లలన్ సింగ్, బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. వీరందరినీ పరేడ్ గ్రౌండ్ సభకు తీసుకెళ్లనున్నారు. ఇక, బీజేపీ నిర్వహించే సభ కంటే ఎక్కువ స్థాయిలో జనాన్ని సమీకరించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. దీని కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
కేటీఆర్ ఉంటారా..?
బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ వరుసగా దూరంగా ఉంటున్నారు. కీలక సమావేశాలకు వెళ్లడం లేదు. అటు ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సం, ఆ తర్వాత పార్టీ ప్రకటన, ఏపీకి చెందిన తోట చంద్రశేఖర్ పార్టీలో చేరిక సందర్భంగా నిర్వహించిన సమావేశంతో పాటుగా ఖమ్మంలో నిర్వహించిన తొలి సభకు సైతం గైర్హాజరయ్యారు. దీంతో పలు రకాల ప్రచారం జరిగింది. తాజాగా వచ్చేనెల 17న బీఆర్ఎస్ భారీ మీటింగ్ ఏర్పాటు చేస్తుండటంతో.. కేటీఆర్ ఉంటారా.. లేక ఏదైనా పర్యటన పేరుతో గైర్హాజరవుతారా అనే అనుమానాలు మొదలయ్యాయి.