రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే

రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే

కామారెడ్డిలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తా    
రోడ్ షోలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, తెలంగాణలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పదేళ్ల అవినీతి పాలనకు చరమగీతం పాడి, కాంగ్రెస్​ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య ఈ యుద్ధం జరుగుతోందన్నారు. పదేళ్లలో దొరల తెలంగాణను చూశారని, ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు తెలంగాణ ధనాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. లక్ష కోట్ల రూపాయలను ఒకటే ప్రాజెక్టు ద్వారా దోచుకున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. మహిళల ఖాతాల్లో నెలనెలా రూ.2,500 జమ చేస్తామన్నారు. రూ.500లకే గ్యాస్​ సిలిండర్​ అందిస్తామన్నారు. ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం కల్పిస్తామని వెల్లడించారు.  

రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాలో యేటా రూ.15వేలను చెల్లిస్తామని, రూ.12వేలను కూలీలకు అందిస్తామన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్​అందిస్తామని అన్నారు. కేసీఆర్ లక్షలాది మందిని నిరాశ్రయులు చేయగా, తాము రూ.5లక్షలను ప్రతీ ఒక్కరికి అందిస్తామన్నారు. కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్ కు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని, తనను భారీ మెజార్టీతో గెలిపించాలని రేవంత్​రెడ్డి కోరారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  హైదరాబాద్ –  -కామారెడ్డి మధ్య పరిశ్రమల కారిడార్ ను ఏర్పాటు చేస్తామన్నారు.  ఈ ప్రాంతంలో గల్ఫ్ కార్మికులు అధికంగా ఉన్నారని, వారికోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు.   బీడీ కార్మికుల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని, కటాఫ్ తేదీ లేకుండా పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. దేశమంతా కామారెడ్డి వైపు చూస్తోందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యమని అన్నారు. తమ ప్రభుత్వంలో తెలంగాణలో విద్యార్థులకు విద్యా ఉపాధి అవకాశాలు, బడుగు, బలహీన వర్గాలను ఆదుకునేందుకు ప్రణాళికలు చేశామన్నారు. కేసీఆర్ నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారన్నారు. కేసీఆర్ బాయ్ బాయ్ అంటూ నినాదాలు చేశారు.