డబుల్ బెడ్రూం ఇళ్ల అవకతవకలపై సమగ్ర జరపాలి
- నిజాంపేట జడ్పిటిసి పంజా విజయ్ కుమార్
- నందిగామ డబుల్ బెడ్రూం ఇళ్ల అవకతవకలపై కలెక్టర్ కు ఫిర్యాదు
ముద్ర ప్రతినిధి, మెదక్: డబుల్ బెడ్రూం ఇళ్ల ఎంపికలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిజాంపేట జడ్పిటిసి సభ్యులు పంజా విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. నిజాంపేట మండలంలోని నందిగామ గ్రామంలో జరిగిన డబుల్ బెడ్రూం ఇళ్ల అక్రమాలపై విచారణ జరపాలని కోరుతూ గురువారం జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పంజా విజయ్ కుమార్ మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత లేదన్నారు.అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లబ్ధిదారుల జాబితాను తహశీల్దార్ కు తాను ఓ జడ్పిటిసి సభ్యునిగా అడిగితే నిర్లక్ష్యపు సమాధానం చెప్పడమే కాకుండా మీకు చెప్పాల్సిన అవసరం లేదనడం ఎంతవరకు సమంజసమన్నారు. నిజాంపేట మండలంలో ప్రజాప్రతినిధులకు గౌరవం లేదన్నారు. ప్రజలతో ఎన్నుకోబడ్డ జడ్పిటిసిగా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డబుల్ బెడ్రూం ఇళ్లు ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. ప్రోటోకాల్ ఉల్లంఘించిన తహసీల్దార్ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామ సభలో చర్చించకుండా హడావిడిగా ఎలా ప్రారంభిస్తారని ఆయన ప్రశ్నించారు. ఏది అడిగిన అధికారులు ఎమ్మెల్యే పేరే చెప్పడం ఎంత వరకు సమంజసమన్నారు. అర్హులకు ఇళ్లు ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ, పట్టణ బీజేపీ అధ్యక్షులు నాయిని ప్రసాద్, బీజేపీ నాయకులు మహిపాల్ రెడ్డి, రాహుల్, శశాంక్, శ్రీకాంత్, లింగరాజు ఉన్నారు.