ఎఫ్ ఎన్ సీసీ ఆలిండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్ ప్రారంభం ప్రారంభించిన హీరో నిఖిల్
హైదరాబాద్, ముద్ర: ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్(ఎఫ్ ఎన్ సీసీ) నిర్వహించే 12వ ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్ ను హీరో నిఖిల్ శనివారం ప్రారంభించారు. సౌత్ ఇండియాలోనే ఇది బిగ్గెస్ట్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు 68 టీములు సిద్ధంగా ఉన్నాయి. నవయుగ ఇంజనీరింగ్ స్పాన్సర్షిప్ తో ఈ టోర్నమెంట్స్ ఘనంగా నిర్వహిస్తారు. చైనాలో జరిగిన స్పోర్ట్స్ లో సిల్వర్ మెడల్స్ గెలిచిన పలువురిని ఎఫ్ ఎన్ సీసీ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో నిఖిల్, ఎఫ్ ఎన్ సీసీ వైస్ ప్రెసిడెంట్ తుమ్మల రంగారావు, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రెటరీ వి ఎస్ ఎస్ పెద్దిరాజు, ఏడిద సతీష్ (రాజా) , మాజీ క్రికెటర్ , ముంబై మాస్టర్స్, ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ ఫ్రాంచెస్ కో ఓనర్ చాముండేశ్వరనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ తాను ఒక యాక్టర్ ని కానీ ఇలా ఈవెంట్ కి వచ్చి క్రీడాకారులను కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. స్పోర్ట్స్ లో ఇంటర్నేషనల్ వరకు వెళ్లి ఇండియా కోసం గోల్డ్, సిల్వర్ మెడల్స్ గెలిచిన వాళ్ళని కలవడం, వాళ్ళని సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. యువత ఈ బ్రిడ్జ్ టోర్నమెంట్ గురించి తెలుసుకోవాలని, దీని ద్వారా ఇంకా ఎక్కువ మంది యువకులు ముందుకొచ్చి పాల్గొనాలని అన్నారు. ఎఫ్ ఎన్ సీసీ వైస్ ప్రెసిడెంట్ రంగారావు టోర్నమెంట్లో పాల్గొనే టీమ్స్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఎఫ్ ఎన్ సీసీ సెక్రెటరీ ముళ్ళపూడి మోహన్ హీరో నిఖిల్ కి ధన్యవాదాలు తెలిపారు.