గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట 

గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట 

ముద్ర, తెలంగాణ బ్యూరో : గద్వాల్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు  స్టే విధించింది. కృష్ణమోహన్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటించిన తెలంగాణ హైకోర్టు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కృష్ణమోహన్‌రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ జరిపిన కోర్టు రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈసీ, ప్రతివాదులకు నోటీసులను జారీ చేసింది. గత ఎన్నికల్లో అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారనే కారణంగా గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిపై తెలంగాణ హైకోర్టు ఆగస్టు 24న అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే.