అద్వానీని కలిసి అభినందించిన దత్తాత్రేయ

అద్వానీని కలిసి అభినందించిన దత్తాత్రేయ
  • గత స్మృతులు నెమరువేసుకున్న ఇద్దరు నేతలు

న్యూఢిల్లీ: ఆధునిక భారతదేశ అభివృద్ధి పథం రూపశిల్పి, దేశాన్ని సరైన దిశలో నడిపించే సమర్థ నాయకత్వాన్ని అందించిన స్టేట్స్ మన్ లాల్ కిషన్ అద్వానీ అని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అభివర్ణించారు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందుకున్న తర్వాత ఆయనను స్వయంగా కలిసి అభినందించడానికి దత్తాత్రేయ శుక్రవారం న్యూఢిల్లీలోని ఆయన నివాసానికి విచ్చేశారు. దేశానికి అద్వానీ చేసిన అమూల్యమైన సేవలను గుర్తించి ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రదానం చేసినందుకు ఆయన భారత ప్రభుత్వానికి దత్తాత్రేయ అభినందనలు తెలిపారు. ఇంతటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన ఆయనను కలుసుకోవడం ఎంతో ఆనందంగా వుందని, ఆయన ఆశీర్వాదం పొందానని తెలిపారు.

ఇద్దరు నాయకులు గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 1980 దశకం చివరి నుంచి 2014 దాకా దేశానికి చేసిన సేవ చేయడంలో వారిద్దరు కలిసి నడిచిన తీరును గుర్తు చేసుకున్నారు. జ్ఞాపకాల దొంతరలు నెమరువేసుకుంటున్న సమయంలో అద్వానీ చిరునవ్వులు చిందించారు. భగవంతుడి ఆశీర్వాదంతో అద్వానీ ఆయురారోగ్యాలతో విలసిల్లాలని దత్తాత్రేయ కోరుకున్నారు.