అనుమానంతో భార్యను చంపి... ఆరు ముక్కలుగా చేసి....
చత్తీస్ గఢ్ : చత్తీస్గఢ్లో ఒక దారుణ ఘటన వెలుగు చూసింది. అనుమానంతో భర్త, భార్యను దారుణంగా చంపేయడమే కాకుండా హత్య తరువాత భార్య మృతదేహాన్ని టేపుతో చుట్టేసి.. ఇంట్లోనే వాటర్ ట్యాంక్ లో దాచి పెట్టాడు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని బిలాస్ పూర్ నగరంలో వెలుగు చూసి కలకలం రేపింది. భార్యను చంపడానికి కారణం ఆమె మీద అతడికి అనుమానం కలగడమే. బిలాస్ పూర్ చక్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉస్లాపూర్ దగ్గర ఈ ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనలో మరో ట్విస్ట్ ఏంటంటే రెండు నెలల తర్వాత కానీ ఇది వెలుగులోకి రాకపోవడం. ఘటన జరిగిన రెండు నెలల తర్వాత ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంలో ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు వచ్చి వెతకగా అసలు విషయం వెలుగు చూసింది. ఫిర్యాదు అందుకున్న వెంటనే నిందితుడి ఇంటికి వచ్చిన పోలీసులు ఇల్లు మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వాటర్ ట్యాంక్ లో సాతి సాహూ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ హత్య వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాల నేపథ్యంలోనే జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి భర్త పవన్ సింగ్ ఠాకూర్ ని హత్యానేరం కింద అరెస్టు చేశారు. ఆ మహిళ మృతదేహం ఇంట్లోనే సింటెక్స్ ట్యాంక్ లో ఆరు ముక్కలుగా లభించింది. అది చూసి షాక్ అయిన పోలీసులు వెంటనే భర్తని అనుమానితుడిగా అరెస్టు చేసి అతడిని ప్రశ్నిస్తున్నారు. అతని నుంచి హత్యకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. బిలాస్పూర్ పోలీసులు దర్యాప్తు కూడా ప్రారంభించినట్లు తెలిపారు.