మరో రెండేళ్లలో పీఓకే భారత్‌లోకే..! 

మరో రెండేళ్లలో పీఓకే భారత్‌లోకే..! 

చండీగఢ్‌: పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ను ఉద్దేశించి హరియాణా మంత్రి కమల్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండుమూడేళ్లలో పీఓకే.. భారత్‌లో భాగమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు రోహ్‌తక్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. '2014కు ముందు మనదేశం అంతబలంగా లేదు. కానీ ఇప్పుడు దృఢంగా మారింది. కశ్మీర్‌లో కొంతభాగాన్ని పాకిస్థాన్‌ ఆక్రమించింది. అక్కడ భారత్‌తో కలవాలనే ఆకాంక్షలు వినిపిస్తున్నాయి. రానున్న రెండుమూడు సంవత్సరాల్లో ఏ క్షణమైనా పీఓకే.. భారత్‌లో భాగం కావొచ్చు.

అది ప్రధాని మోదీ(Modi) నాయకత్వంలోనే సాధ్యం అవుతుంది' అని గుప్తా అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీపైనా విమర్శలు గుప్పించారు. మెరుపు దాడులు Surgical strikes (సర్జికల్‌ స్ట్రైక్స్‌) చేసి చాలామంది ముష్కరుల్ని చంపినట్లు చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. దానికి తగ్గ రుజువుల్ని చూపించాలంటూ ఆ పార్టీ నేతల నుంచి వచ్చిన డిమాండ్లను తప్పుపట్టారు. అలాగే ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ  నేతృత్వంలో జరిగిన భారత్‌ జోడో యాత్ర గురించి మాట్లాడుతూ.. 'భారతదేశాన్ని ఏకం చేస్తామంటూ మాటలు చెప్పేవారే దానిని విచ్ఛిన్నం చేస్తున్నారు' అని మండిపడ్డారు.