ఏపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి సహా 12మందికి హైకోర్టు నోటీసులు...

ఏపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి సహా 12మందికి హైకోర్టు నోటీసులు...

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా 12మందకి హైకోర్టు నోటీసులు ఇచ్చినట్లు మాజీ జడ్జి ఎస్ రామకృష్ణ తెలిపారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటకు చెందిన మాజీ జడ్జి ఎస్‌.రామకృష్ణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను బయటపెట్టిన తనకు రక్షణ కల్పించాలని కోర్టును కోరారు. ఈ రిట్‌ పిటిషన్‌ విషయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటుగా.. ఆయన సోదరుడు, ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డితో సహా 12 మందికి హైకోర్టు నోటీసులిచ్చినట్లు రామకృష్ణ తెలిపారు.

గత వైఎస్సార్‌సీపీ పాలనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి సోదరులు తమ అనుచరుల ద్వారా తనను వేధించారన్నారు రామకృష్ణ. బి.కొత్తకోటలోని తన ఇంటిపై దాడికి తెగబడ్డారని.. గత నెల 27న ఫోర్జరీ సంతకాలతో ఒకరు తనపై తప్పుడు ఫిర్యాదు చేయగా.. కేసు కూడా నమోదు చేశారన్నారు. తనపై తప్పుడు కేసు పెట్టారని స్థానికంగా సీఐతో పాటుగా అన్నమయ్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.

గతంలో జరిగిన సంఘటనలను ప్రస్తావించిన రామకృష్ణ.. తన ప్రాణాలకు ముప్పు ఉందని, అత్యవసర పిటిషన్‌ కింద స్వీకరించాలని హైకోర్టును కోరినట్లు తెలిపారు. హైకోర్టు తన రిట్ పిటిషన్‌ను పరిశీలించి పెద్దిరెడ్డి సోదరులకు నోటీసులిచ్చిందన్నారు. ఈ రిట్ పిటిషన్‌పై విచారణ చేసి నివేదికను అందజేయాలని అన్నమయ్య జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. హైకోర్టు నోటీసుల అంశంపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించాల్సి ఉంది.