చెరువులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిది

చెరువులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిది

పలువురు వక్తలు
హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై మానవహారం

ముద్ర, ముషీరాబాద్: ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా సేవ్ హుస్సేన్ సాగర్ - సేవ్ హైదరాబాద్ నినాదంతో హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం ట్యాంక్ బండ్ పైన మానవహారాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పర్యావరణవేత్త ప్రొఫెసర్ దొంతి నరసింహారెడ్డి హాజరై  మానవహారాన్ని ప్రారంభించారు. అనంతరం నరసింహారెడ్డి మాట్లాడుతూ హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ లాంటి చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదన్నారు. దురదృష్టవశాత్తు హుస్సేన్ సాగర్ కాలుష్యంతో ప్రమాదకారిగా మారిందని అన్నారు.

ప్రభుత్వం జీఓ 111 రద్దు ఫలితంగా హైదరాబాదు జంట నగరాలకు తీవ్ర వరద ప్రమాదం ముంచుకొస్తుందని, జీవో 111 ను వెంటనే  పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రముఖ పర్యావరణవేత్త సాగర్ ధారా మాట్లాడుతూ హుస్సేన్ సాగర్ ను కాలుష్య రహితంగా మార్చాల్సిన అవసరం ఉన్నదని, గతంలో హుస్సేన్ సాగర్ శుద్ధి కొరకు ప్రభుత్వం నియమించిన కమిటీలో తాను కూడా ఉన్నానని చెప్పారు. హుస్సేన్ సాగర్ లో చేరే కాలుష్యాలను అరికడితే క్రమంగా హుస్సేన్ సాగర్ ను కాలుష్య రహితంగా మార్చవచ్చని అన్నారు. ఈ సంవత్సరం అంతర్జాతీయంగా ప్లాస్టిక్ కాలుష్యంపై పోరాడాలని పిలుపునిచ్చారని, ప్లాస్టిక్ ను నియంత్రించాలని, అందుకు  ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు.

ప్రముఖ మెజీషియన్ చొక్కాపు వెంకటరమణ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని, ప్రభుత్వాలు అందుకనుగునంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలంతా ఇందుకు సహకరించాలని అన్నారు. సామాజిక వేత్త చుంచు రాజీవ్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఐక్యరాజ్యసమితి "బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ నినాదాన్ని ఇచ్చిందని ప్లాస్టిక్ పొల్యూషన్ ప్రపంచ మానవాళికే ముప్పుగాపరిణమించిందన్నారు. ప్లాస్టిక్ కాలుష్యం ఫలితంగా అనేక రకాల అనర్థాలను మనం ఎదుర్కొంటున్నామని చెప్పారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో సముద్రాలు సైతం   కాలుష్యానికి గురయ్యే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం సదస్సులు, సెమినార్లు నిర్వహిస్తున్నామని తెలిపారు.

విద్యార్థుల స్థాయి నుండి చైతన్యాన్ని పెంచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అమ్మ సేవా సంస్థ నాయకులు డాక్టర్ కంటే సాయన్న పర్యావరణంపై గేయాన్ని ఆలపించి ఉత్తేజపరిచారు. హైదరాబాద్ జిందాబాద్ ప్రధాన కార్యదర్శి కె వీరయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి ఎం. శ్రీనివాసరావు, పి.శ్రీనివాసరావు, నగేష్, రాజమౌళి, మోహన్,  మాధవి, మోహన్ నాయుడు, నాగేశ్వరరావు, సైదులు, గోపాల్, సుకుమార్, సంగీత, హస్మిత, సంజీవరెడ్డి, జెకె శ్రీనివాస్, కృష్ణమోహన్, మేఘన, నరసింగరావు, అజయ్, నరేష్ తదితర సభ్యులు పాల్గొన్నారు.