బీమాతో ధీమా..

బీమాతో ధీమా..

న్యూఢిల్లీ: భారతీయులకు జీవిత బీమా అంటే ముందుగా గుర్తుకువచ్చేది ఎల్ఐసీ. ముఖ్యంగా పెట్టిన పెట్టుబడి భరోసా ఉంటుందని అందరూ ఎల్ఐసీను ఆదరిస్తారు. ఎన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు పోటీలో ఉన్నా ఎల్ఐసీ తన మార్క్ నమ్మకంతో కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్‌ను తీసుకువస్తూ వినియోదారుల మనన్నలు అందుకుంటుంది. ప్రస్తుతం ఎల్ఐసీ మరో కొత్త ప్లాన్ ‘ఎండోమెంట్ పాలసీ’ తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ద్వారా హామీ ఇచ్చిన రాబడితో పాటు అదనపు బోనస్‌లు కూడా వినియోగదారుల చేతికి వస్తాయి. అయితే ఈ బోనస్‌లు మాత్రం ఏ సంవత్సారానికి ఆ సంవత్సరం చెబుతుంటారు. అలాగే పాలసీ వ్యవధి కూడా 12 నుంచి 35 సంవత్సరాల వరకూ ఉంటుంది. ఈ పాలసీను కనీస హామీ మొత్తం రూ.లక్షతో ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే గరిష్ట హామీ మొత్తం మాత్రం లేదు. ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. పాలసీదారు పరిమిత లేదా సాధారణ ప్రీమియం చెల్లింపుల మోడ్‌లను ఎంచుకోవచ్చు. అలాగే ఆదాయపు పన్ను మినాహాయింపులను కూడా వినియోగదారుల పొందుతారు. అలాగే ప్రతి ఏడాది కస్టమర్లకు వచ్చే బోనస్‌లను పాలసీ వ్యవధిలో జమ చేస్తారు. అదనంగా పాలసీదారు మెచ్యూరిటీ వరకూ పాలసీ కొనసాగిస్తే టెర్మినల్ బోనస్‌ను కంపెనీ అందిస్తుంది. ఈ ఎల్ఐసీ ఎండోమెంట్ పాలసీ ఎనిమిది నుంచి 50 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న వారు తీసుకోవచ్చు. పాలసీదారుకు మెచ్యూరిటీ సమయానికి గరిష్టంగా 75 సంవత్సరాలు ఉండాలి. 

ఈ పాలసీను భారతీయులతో పాటు భారతీయ మూలం ఉన్న విదేశీయులు కూడా తీసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌తో పాటు వయస్సు నిర్ధారణ పత్రం, చిరునామా, గుర్తింపు రుజువును సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ రెండు పద్ధతుల్లో వినియోగదారులు ఈ పాలసీని పొందవచ్చు. ఎల్ఐసీ వెబ్‌సైట్‌లో బై పాలసీ ఆన్‌లైన్ ట్యాబ్‌ను క్లిక్ చేసి పాలసీ ఎంచుకుని పొందవచ్చు. మార్కెట్ నిపుణుల సూచన ప్రకారం ఎల్ఐసీలో ఎక్కువ మొత్తం రాబడి పొందాలంటే కనీసం 20 సంవత్సరాల పాలసీ వ్యవధి ఉండేలా చేసుకోవాలి. ఓ వినియోగదారుడు రూ.10 లక్షల పాలసీ తీసుకున్నాడనుకుంటే ఎల్ఐసీ అందించే బోనస్‌లు నాలుగు శాతం వరకూ వస్తాయని అంచనా వేసుకోవాలి. వాటితో పాటు టెర్మినల్ బోనస్ రూ.1.5 లక్షల వరకూ వినియోగదారుడు పొందుతాడు. అంటే దాదాపు రూ.17.2 లక్షలు సొమ్ము మెచ్యూరిటీ అనంతరం కస్టమర్ చేతికి అందుతుంది.