అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఆరోపణలు...

అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఆరోపణలు...

ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి కుంభంకు లేదు..: మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు

 భువనగిరి ముద్ర ప్రతినిధి: పట్టణంలో జరుగుతున్న  అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని, ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డిని విమర్శించే స్థాయి కుంభం అనిల్ కుమార్ రెడ్డి కి లేదని మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గురువారం స్థానిక వినాయక చౌరస్తా వద్ద జరిగిన కాంగ్రెస్ సభలో డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పట్టణం అభివృద్ధి చెందడం లేదని విమర్శించడం సరికాదన్నారు. ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి  పట్టణ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. రోడ్డు వెడల్పు ,జూనియర్ కాలేజీ మరమ్మత్తు, మార్కెట్ యార్డు, వైకుంఠధామాలు, పార్కులు చెరువు కట్ట అభివృద్ధి పనులు కనబడడం లేదని ప్రశ్నించారు.

గత 20 ఏళ్ళలో జరగని అభివృద్ధి  ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కనబడడం లేదా అని ప్రశ్నించారు. విమర్శలు మాని అభివృద్ధికి సహకరించాలన్నారు. ఈ సమావేశంలో గ్రంధాలయ జిల్లా చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్,ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ కిష్టయ్య, నాయకులు గాదె శ్రీనివాస్, మోహన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.