సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు డీఎస్సీ అభ్యర్థుల నిరసన
ముద్ర,హైదరాబాద్:- సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు డీఎస్సీ అభ్యర్థులు నిరసనకు దిగ్గారు. సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటికి 2008 డీఎస్సీ అభ్యర్థులు భారీగా చేరుకున్నారు. వారు ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని సీఎంను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు. 2008 డీఎస్సీ నోటిఫికేషన్లో తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2008 డీఎస్సీ అభ్యర్థులను ఆరు వారాల్లో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని కోరారు. తెలంగాణ హైకోర్టు ఫిబ్రవరి 8న డీఎస్సీ అభ్యర్థులకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.