ఆల్ టైం రికార్డ్

ఆల్ టైం రికార్డ్
  • 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
  • 9.5 లక్షల రైతుల నుండి 12,500 కోట్ల ధాన్యం సేకరణ
  • 16వ తేదీ నాటికి మొత్తం డబ్బులు చెల్లిస్తాం
  • రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో చరిత్రలో ఎప్పుడు లేనంతగా అద్భుతమైన పంట దిగుబడి వచ్చిందని బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం స్థానిక కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 10వ తేదీ చరిత్రలోనే నిలిచిపోతుంది అన్నారు.  62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆల్ టైం రికార్డ్ సృష్టించామన్నారు. గత సంవత్సరం జూన్ 10వ తేదీ నాటికి కేవలం 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశామని పేర్కొన్నారు.

ఇప్పటివరకు 9 లక్షల 50వేల మంది రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోగా, 12,450 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. తొలుత తెలంగాణ వ్యాప్తంగా 7,192 ధాన్యం కేంద్రాలను ప్రారంభిస్తామని ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ 7,034 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో 4,135 కేంద్రాల ద్వారా మాత్రమే కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఇప్పటివరకు 6 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు. మిగతా డబ్బులను సైతం జూన్ 15లోగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. రెండవ పంటను కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకున్నామని స్పష్టం చేశారు. జూన్ 16వ తేదీ వరకు కొనుగోలు కేంద్రాలను మూసి వేస్తామని పేర్కొన్నారు. ఆలస్యంగా ప్రారంభమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అనుమతిని ఇస్తామని చెప్పారు.

సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న

కరీంనగర్ నగరానికి స్మార్ట్ లుక్ రావడానికి తానే స్వయంగా మంత్రిగా, సివిల్ ఇంజనీర్ గా ప్రణాళికలకు రూపకల్పన చేస్తున్నట్లు స్పష్టం చేశారు. స్వయంపాలనలో కరీంనగర్ గొప్ప నగరంగా అవతరించింది అన్నారు. గణేష్ నగర్ బైపాస్ రోడ్డును గత 50 సంవత్సరాలుగా ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు సుందరంగా తీర్చిదిద్దాం అని తెలిపారు. సౌత్ ఇండియాలోనే తొలి కేబుల్ బ్రిడ్జిని ఈనెల 21వ తేదీన మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కేబుల్ బ్రిడ్జి దుర్గం చెరువు కన్నా అడ్వాన్సుగా ఉంటుందని తెలిపారు.

కేబుల్ బ్రిడ్జిలో 10/30 అడుగుల స్క్రీన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని వెల్లడించారు. అదేరోజు సెంట్రల్ లైటింగ్ ని కూడా ప్రారంభించుకుంటాం అని స్పష్టం చేశారు. 21వ తేదీన కేబుల్ బ్రిడ్జితో పాటు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం, ట్రాఫిక్ సిగ్నల్స్, ఫ్రీ వైఫై ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. సాయంత్రం ఏడు గంటలకు లైటింగ్ సిస్టం క్రాకర్ షో, లేజర్ షో, బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఊహకు అందని విధంగా మానేరు రివర్ ఫ్రంట్ ను నిర్మిస్తున్నాం అని వ్యాఖ్యానించారు. ఆగస్టు 15వ తేదీన మొదటి దశ ఎంఆర్ఎఫ్ ను ప్రారంభించుకోబోతున్నట్లు తెలిపారు. అదేరోజు ప్రపంచంలోనే మూడవదైన వాటర్ ఫౌంటెన్ ప్రారంభిస్తామని తెలిపారు.

72 కోట్లతో నిర్మించనున్న ఈ ఫౌంటెన్ టెండర్లు పూర్తయి పనులు ప్రారంభమయ్యే దశలో ఉన్నాయన్నారు. ఓటు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి పరిపాలన అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ విమర్శలు పట్టించుకోకుండా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ సమావేశంలో మేయర్ వై సునీల్ రావు, గ్రంథాలయ కమిటీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, బిఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.