బహుజన వీరుదు పాపన్నగౌడ్ - జిల్లా కలెక్టర్ పాటిల్
ముద్ర ప్రతినిధి కామారెడ్డి: పాలకుల అరాచకాలను అణిచివేసేందుకు పుట్టిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ అని జిల్లాకలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సర్వాయి పాపాన్న జయంతి సందర్భంగా శుక్రవారం బి.సి.అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహనీయులు ఏ ఒక్క కులం కోసం కాకుండా అందరి కోసం పాటుపడ్డారని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న ఆనాటి పాలకుల అరాచకాలను అణచివేసి అణగారిన వర్గాల పేదల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడారని గుర్తు చేశారు.
అన్ని వర్గాల వారు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని, ప్రజాస్వామిక స్పూర్తితో పోరాడడం గొప్ప విషయమని కొనియాడారు. ప్రతి ఒక్కరు వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. .ఈ సందర్భంగా గీతా కార్మికులకు కూడా బి.సి.బంధు వర్తింప చేయాలని గౌడ సంఘం నాయకులు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో బి.సి.అభివృద్ధి అధికారి శ్రీనివాస్, ఆబ్కారీ అధికారి రవీంద్ర రాజు, సిపిఒ రాజారామ్, డిపిఆర్ ఓ శాంతి కుమార్, జెడ్పిటిసి తిరుమల గౌడ్, బి.సి.సంఘాల నాయకులు బాలార్జున్ గౌడ్, గోపి గౌడ్, మహేష్ గౌడ్, శివరాం, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.