తెలంగాణకు  గవర్నర్‌గా రావడం దేవుని ఆశీర్వాదం : తమిళిసై

తెలంగాణకు  గవర్నర్‌గా రావడం దేవుని ఆశీర్వాదం : తమిళిసై

అమరవీరులను స్మరిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్  తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాజ్‌భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు  ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా గవర్నర్  రాజ్‌భవన్‌లో రాజ్‌భవన్‌లో కేక్ కట్ చేశారు. అక్కడ నృత్యకారులతో కలిసి గవర్నర్ ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. గవర్నర్ తొలిసారి తన ప్రసంగాన్ని మొత్తం తెలుగులో మాట్లాడారు. అనేక పోరాటాల వల్ల సాధించుకున్న తెలంగాణకు  గవర్నర్‌గా రావడం దేవుని ఆశీర్వాదమన్నారు. ఆధునిక ప్రపంచంలో తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు.

తెలంగాణ అమరవీరులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. స్వరాష్ట్ర ఏర్పాటులో భాగంగా తనువు చాలించిన వారి పేర్లను స్మరించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో మూడు వందల మంది అమరులయ్యారన్నారు. దశాబ్ద కాలంలో తెలంగాణ ఎన్నో ప్రత్యేకతలు చవి చూసిందని చెప్పారు. తెలంగాణ అంటే స్లోగన్ కాదని.. అది ఆత్మ గౌరవ నినాదమన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు  కావాలని గవర్నర్ తమిళి సై ఆకాంక్షించారు.  తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాద్ అభివృద్ధి మాత్రమే కాదని గవర్నర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం అభివృద్ధి అయితేనే సంపూర్ణ అభివృద్ధి అనిపించుకుంటుందని చెప్పారు. వచ్చే సంవత్సరం నాటికి దేశంలో తెలంగాణ నంబర్1 కావాలని ఆకాంక్షించారు. అమరవీరులందరికీ జోహార్లు తెలిపారు. ‘‘నా జీవితంలో ప్రతి నిమిషం ప్రజల కోసమే.. దేవుడు నన్ను తెలంగాణకు పంపడం గొప్ప అదృష్టం. నేను మీతో ఉన్నాను. మీరు నాతో ఉన్నారు’’ అంటూ గవర్నర్ తమిళి సై పేర్కొన్నారు.