కామారెడ్డి జిల్లాలో ఘనంగా ఈద్ ఉల్ ఫితర్
- ముస్లింలకు ఈద్ ముబారక్ చెప్పిన ప్రముఖులు
- రంజాన్ తో శాంతి, సౌభ్రాతృత్వం: అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో ఈద్ ఉల్ ఫితర్ శనివారం ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రమైన కామారెడ్డి లో ఖదీమ్ ఈద్గాలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజిబుద్దిన్, మాజీమంత్రి షబ్బీర్ అలీ ఇతర ప్రముఖులు ఈద్ నమాజు చదివిన అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ అన్యోన్యలు కలిసి ఆలింగనం చేసుకొంటూ ఈద్ ముబారక్ చెప్పారు. అనంతరం సేవియా సేవించారు. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే బాన్సువాడ లో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్ ను తాంజీముల్ మస్జిది ఆధ్వర్యంలో సన్మానించారు. అనంతరం జరిగిన సభలో స్పీకర్ మాట్లాడుతూ మత సామరస్యానికి తెలంగాణ రాష్ట్రం ప్రతీక అన్నారు.శాంతి, సౌభ్రాతృత్వం, సోదరభావం, సహాయం, ధానగుణం, కష్టసుఖాలను పరస్పరం పంచుకునే సద్గుణాలను ఈ పవిత్ర రంజాన్ మాసం నేర్పిందన్నారు.
మైనారిటీల సంక్షేమానికి దేశంలో మరెక్కడా కూడా లేనివిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్రం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నదని తెలిపారు. రంజాన్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతూ పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేస్తున్నారని తెలిపారు.
మసీదులు, ఈద్గాల అభివృద్ధికి, మరమ్మత్తులకు నిధులిస్తున్నారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విదంగా తెలంగాణ రాష్ట్రంలో 204 మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేశారని తెలిపారు.ఇమామ్,మౌజంలకు నెలకు రూ. 5 వేల చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నారని,పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు షాదీ ముభారక్ ద్వారా రూ.1,00,116 లు ఉచితంగా అందజేస్తున్నదని అన్నారు.ముస్లిం సోదర సోదరీమణులు అందరూ తమ బందు, మిత్రులతో కలిసి రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని స్పీకర్ పోచారం కోరారు. అలాగే ఎలారెడ్డిలో జరిగిన రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్, బిచ్కుంద లో జరిగిన రంజాన్ వేడుకల్లో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.