ఆషాఢ బోనాలు షురూ!
![ఆషాఢ బోనాలు షురూ!](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_64953f2731415.jpg)
- అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారు బోనం సమర్పించిన మంత్రులు
- తొట్టెల ఊరేగింపులో పాల్గొన్న ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని, మహమూద్ అలీ
ముద్ర, తెలంగాణబ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా ఆషాఢ బోనాలు గురువారం ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటపైన ఉన్న జగదాంబిక ఆలయంలో మొదటి బోనాన్ని సమర్పించారు. గోల్కొండ కోటలో 9 వారాలపాటు భక్తులు ప్రతీ గురు, శుక్రవారం అమ్మవారికి బోనాలను సమర్పించనున్నారు. లంగర్హౌస్ చౌరస్తా నుంచి ప్రారంభమైన అమ్మవారి తొట్టెల ఊరేగింపులో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారు బోనాన్ని సమర్పించారు. లంగర్ హౌస్ నుంచి రథం, తొట్టెల ఊరేగింపు ప్రారంభమై గోల్కొండ కోటలోని జగదాంబ ఆలయం వరకు కొనసాగింది. ఉత్సవ విగ్రహాలకు ఆలయ కమిటీ సభ్యులు, ప్రధానార్చకులు ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రముఖ పండుగలలో ఒకటైన బోనాలను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిందన్నారు. 2014 నుంచి 2022 వరకు బోనాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.78.15 కోట్లు కేటాయించిందన్నారు. ఈ నిధులను ప్రతీ సంవత్సరం 3,033 ఆలయాలకు పంపిణీ చేస్తామన్నారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అకాంక్షించారు. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో బోనాలు ఘనంగా జరిగాయన్నారు. వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ బోనాలకు భక్తులు తరలివస్తారని తెలిపారు.