కొమురవెళ్లి మల్లన్న సేవలో మంత్రి హరీశ్ రావు 

కొమురవెళ్లి మల్లన్న సేవలో మంత్రి హరీశ్ రావు 
  • రూ.12 కోట్లతో క్యూ లైన్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన

ముద్ర ప్రతినిధి,సిద్దిపేట:సిద్ధిపేట జిల్లా కొమురవెళ్లిలో కొలువు దీరిన శ్రీ మల్లిఖార్జున స్వామి వారి సేవలో బుధవారం నాడు రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు.జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి మంత్రి ఆలయంలో పట్నం వేసి, కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం మల్లన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.

అనంతరం కొమురవెళ్లి మల్లన్న దివ్య క్షేత్రంలో రూ.12 కోట్ల వ్యయంతో క్యూ లైన్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొమురవెళ్లి మల్లన్న దేవాలయం దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. కొమురవెళ్లి మల్లన్నకు ముఖ్యమంత్రి హోదాలో కెసిఆర్ పట్టువస్త్రాలు సమర్పించారని. అప్పుడే దేవాలయాభివృద్ధి భూమి పూజ చేసి,  ఇతోధికంగా ఆలయ అభివృద్ధికై సంకల్పించారని చెప్పారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇక్కడికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు ఉండేవి కావని,దేవాలయ అభివృద్ధికై రూ.36 కోట్లు వెచ్చించి వివిధ అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపట్టినట్లు వెల్లడించారు.మల్లన్న కల్యాణోత్సవంలో ఇచ్చిన హామీ మేరకు మల్లన్నకు బంగారు కిరీటం,వెండి తలుపులు,వెండి ముఖద్వారాలు చేయించినట్లు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అతిపెద్ద మల్లన్న సాగర్ జలాశయం ప్రారంభించి,ఆ గోదావరి జలాలు తెచ్చి మల్లన్నకు కాళ్లు కడిగి సీఎం కేసీఆర్ మొక్కు చెల్లించుకున్నారని,ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయించడంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంకు కల్పతరువుగా మారిందని అన్నారు. మొక్కు తీర్చుకొనేందుకు కొమురవెల్లికి వచ్చిన సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేర రాజీవ్ రహదారి నుంచి ఆలయానికి వచ్చేలా రూ.10.30 కోట్లు నిధులతో డబుల్ లేన్ రోడ్డు పనులుచేపట్టామని తెలిపారు. దేవాలయ ఆవరణలోని గుట్టపై 100 గదులతో సత్రాల నిర్మాణం చేపట్టామని తెలిపారు.

మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాకర్,ఇతర దాతల సహకారంతో  దేవాలయ అభివృద్ధి పనులుచేపడుతున్నట్లు వివరించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్లాస్టిక్ రహిత దేవాలయంగా ఉండాలని ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రయత్నం చేస్తున్నారని, ఇందుకు భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.గతంలో మల్లన్న ఆలయానికి రూ.4,5 కోట్లు ఆప్యాయం మాత్రమే వచ్చేదని, కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత దినదినాభివృద్ధి చెంది ఇవాళ రూ.18 కోట్ల మేర ఆదాయం వస్తున్నదని మంత్రి వెల్లడించారు.ఈ యేడు ఇంకా కాలం కాకున్నా మల్లన్న దేవుడి ఆశీస్సులతో వర్షం కోసం ఎదురు చూపులు చూడకుండా కాళేశ్వరం ద్వారా వచ్చే జలాలు ఉన్నాయని రైతులు ధైర్యంగా,నమ్మకంతో నారు పోశారని ధీమాగా మంత్రి చెప్పారు.