తెలంగాణకు దిక్సూచి 

తెలంగాణకు దిక్సూచి 
  • ప్రగతికి చిరునామా సిద్దిపేట 
  • రాష్ట్రంలో విస్తారంగా పరిశ్రమలు
  • వ్యవసాయ రంగానికీ పెద్ద పీట
  • కేసీఆర్ ను హ్యాట్రిక్ సీఎంగా చూడాలి
  • హరీశ్ రావుకు లక్షన్నర మెజారిటీ ఇవ్వాలి
  • సిద్దిపేట సభలో మంత్రి కేటీఆర్

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట:తెలంగాణ రావడానికి సిద్దిపేట గడ్డ ఇచ్చిన మద్దతే కారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ నేతృత్వంలో వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి వ్యవసాయ రంగం అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలిచిందన్నారు. సిద్దిపేట స్ఫూర్తిగానే బంగారు తెలంగాణను సాధించుకుందామన్నారు. పట్టణంలో మంత్రి హరీశ్ రావుతో కలిసి కేటీఆర్ గురువారం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నాగుల బండ వద్ద ఐటీ టవర్ ను ప్రారంభించారు. అనంతరం భారీ బహిరంగ సభలో మాట్లాడారు. 1980 నుంచి స్థానిక ఎమ్మెల్యేగా కేసీఆర్ ఇక్కడ చేపట్టిన పథకాలే నేడు వివిధ రూపాలలో రాష్ట్రంలో అమలవుతున్నాయని అన్నారు.దళితబంధు, హరితహారం, మంచినీటి పథకాలు సిద్దిపేటలో ఆనాడు ప్రారంభించినవేనని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల తరువాత కేసీఆర్ ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చూడాలన్నారు హరీశ్ రావును లక్షన్నర మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో 56 వేల కోట్ల ఐటీ ఎగుమతులు ఉండగా, ప్రస్తుతం 2, లక్షల 41 వేల కోట్ల ఎగుమతులు జరిగాయన్నారు అన్నారు. అటు వ్యవసాయ రంగాన్ని, ఇటు ఐటీ రంగాన్ని సమంగా తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని వివరించారు. కేంద్రంలో 59 లక్షల ఉద్యోగాలే ఉన్నాయని, 142 కోట్ల జనాభాలో 0.5 శాతం మాత్రమే కేంద్రం ఉద్యోగాలు కల్పించగలిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 6.5 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఒకప్పుడు బెంగుళూరు, హైదరాబాద్ పిల్లలకు మాత్రమే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లభించే వని,  గ్రామాల విద్యార్థులకు కూడా లభించేలా మంత్రి హరీశ్ రావు కృషి చేయడం అభినందనీయమన్నారు. సిద్ధిపేట ఐటి టవర్ విస్తరణకు మరిన్ని నిధులు వెంటనే కేటాయిస్తానని చెప్పారు. టాస్క్ ద్వారా పిల్లలలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ఆ ఘనత కేసీఆర్ దే

మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా కేంద్రాలకే పరిమితమైన ఐటీ టవర్ ను సిద్దిపేటకు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. సిద్దిపేటలో కేసీఆర్ వేసిన బాటలోనే తాను ముందుకు సాగుతున్నానన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచంలో కోట్లాది మందికి పరిచయం చేసిన ఘనత మంత్రి కేటీఆర్ కు దక్కుతుందన్నారు. సిద్దిపేటకు ఐటీ టవర్ రావడంతో స్థానిక పిల్లలకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లభించాయని పేర్కొన్నారు. ప్రగతి కోసం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిరిగి సీఎం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అనంతరం ఐటీ కంపెనీల యజమానులకు శాలువాలు కప్పి సన్మానించారు. మెమొంటోలు అందజేశారు. విద్యార్థులకు నియామక పత్రాలను అందజేశారు. సభలో ఐటీ శాఖ స్పెషల్ సెక్రెటరీ జయేష్ రంజన్, టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మేనేజింగ్ డైరెక్టర్ నరసింహారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, కౌన్సిలర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.