ప్రజా తీర్పును శిరసావహిస్తాం...
- అధైర్య పడొద్దు... ప్రజలకు అండగా నిలుద్దాం
- శ్రమించిన బిఆర్ఎస్ శ్రేణులకు కృతజ్ఞతలు
- బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, మెదక్:ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజం, ప్రజా తీర్పును శిరసా వహిస్తామని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులతో మాట్లాడారు. 23 ఏళ్లుగా ఉద్యమంలో రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నామని, అధైర్య పడకుండా ముందుకు సాగినట్లు చెప్పారు. నియోజకవర్గ ప్రజలు ఆడబిడ్డగా ఆదరించి సహకరించారన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ చేదోడు వాదోడుగా నిలుస్తూ కష్టసుఖాల్లో పాల్పంచుకుంటానన్నారు. ఓటమితో కృంగి పోకుండా ముందుకు వెళదామనీ కార్యకర్తలు, నాయకులకూ సూచించారు. బిఆర్ఎస్ శ్రేణులు అధైర్య పడకుండా ప్రజలకు అండగా నిలవాలి అన్నారు. ఎన్నికల్లో శ్రమించిన కార్యకర్తలు, నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గంగాధర్, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.