నియోజకవర్గ అభివృద్ధికి కృషి
![నియోజకవర్గ అభివృద్ధికి కృషి](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_64301b2683d44.jpg)
మెదక్ లో మైనంపల్లికి నీరాజనం
ముస్లింలకు గిఫ్ట్ ల పంపిణీ
ముద్ర ప్రతినిధి, మెదక్: తన సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా స్వచ్చందంగా నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని, ఎవరు అడ్డుపడ్డా వెనకడుగు వేసేది లేదని మైనంపల్లి సోషల్ సర్వీస్ఆర్గనైజేషన్ (ఎంఎస్ఎస్ఓ) చైర్మెన్, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే హన్మంతరావ్ కుమారుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన చిన్నశంకరం పేట నుండి మెదక్ పట్టణం వరకు వందలాది బైక్ లు, కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక రాందాస్ చౌరస్థాలో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆ తర్వాత కోదండ రామాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయి బాలాజీ గార్డెన్ లో రంజాన్ పండగ సందర్భంగా వెయ్యి మంది ముస్లింలకు గిఫ్ట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకరించడం, పేదలకు, ఆపదలో ఉన్నవారికి, సహాయం చేయడం, వైద్యసేవలు అవసరమైన వారికి చేయూత అందించాలన్నఉద్దేశ్యంతో ఎంఎస్ఎస్ఓ సేవలను నియోజకవర్గంలో ప్రారంభించామన్నారు. మెదక్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఎంఎస్ఎస్ఓ ఆయా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మెన్ చల్లా నరేందర్, మాజీ కౌన్సిలర్లు కొండన్ సురెందర్ గౌడ్, అరునార్తి వెంటకరమణ, తిమ్మన్నగారి అనిల్, మున్నా, చిన్నశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, నాయకులు ముజీబ్, పవన్, రాజేష్, సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.
భారీ ర్యాలీ
మెదక్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించడంతో ట్రాఫిక్ జాం అయింది. పిల్లికోటాల్ సమీపంలో పెద్ద ఎత్తున యువకులు పోగవడంతో రోడ్డుపై బైక లతో వేచి ఉండడంతో మెదక్- హైదరాబాద్ రహదారిలో రాకపోకలకు అంతరాయం కలిగింది. మునుపెన్నడూ లేని విధంగా మెదక్ పట్టణాన్ని గులాబీమంగా అలంకరించారు. ప్రధాన రహదారుల గుండా గులాబీ తోరణాలు కట్టడంతో పాటు 100కు పైగా భారీ హోల్డింగులు ఏర్పాటు చేశారు. మెదక్ డిఎస్పి సైదులు, టౌన్ ఇన్స్పెక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ క్లియర్ చేయించారు. మైనంపల్లి రోహిత్ ఎంట్రీ మెదక్ ఎంట్రీ రాజకీయ చర్చకు దారి తీసింది.