కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థి మృతి

వికారాబాద్: జిల్లాలోని పూడూరు మండలం చిలాపూర్ సమీపంలోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాల లో దారుణం జరిగింది. కేశవరెడ్డి పాఠశాలకు చెందిన మూడవ తరగతి విద్యార్థి కార్తీక్ మృతి చెందాడు. పదిహేను రోజుల క్రితం బాలుడి భుజానికి తీవ్ర గాయమైంది. ఈ విషయంపై బాలుడి తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం సమాచారం ఇవ్వలేదు. కానీ నాలుగు రోజుల క్రితం కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన తల్లిదండ్రులు స్కూల్‌కు చేరుకుని విద్యార్థిని ఇంటికి తీసుకెళ్లారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. అయితే స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని చెన్‌గోమల్ పోలీస్‌స్టేషన్‌లో బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. టీచర్ కొట్టడం వల్లే బాలుడు మృతి చెందాడని బాలుడి తండ్రి ఆరోపించారు.  కాగా.. స్కూల్ యాజమాన్యం మాత్రం మరోలా చెబుతోంది. బాలుడు బెడ్‌పై నుంచి పడటంతో తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లారని... అక్కడే బాలుడు మృతి చెందాడని కేశవరెడ్డి పాఠశాల యజమాన్యం చెబుతోంది. చనిపోయిన విద్యార్థికి మరోసారి వైద్య పరిక్షలు నిర్వహించాలని డిమాండ్ చేయడం జరిగింది. విద్యార్థి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేసారు. విద్యార్థి గ్రామస్థులు స్కూల్ వద్దకు చేరుకుంటున్నారు. మృతి చెందిన బాలుడి స్వస్థలం మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామం. బాలుడి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.