మన పథకాలు దేశానికే ఆదర్శం – జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

మన పథకాలు దేశానికే ఆదర్శం – జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ (బచ్చన్నపేట) : తెలంగాణలో సీఎం కేసీఆర్‌‌ అమలు చేస్తున్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆదివారం బచ్చన్నపేట మండల బీఆర్‌‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మండల పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేతో పాటు పార్టీ జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ కోటి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. తెలంగాణ  ఏర్పాటుకు ముందు కరువు అల్లాడిన జనగామ ప్రాంతం ఇప్పుడు పచ్చని పంటలతో కలకలలాడుతుందన్నారు.

ఇది మన సీఎం కేసీఆర్‌‌ చలవే అన్నారు. రైతు బాగుంటే దేశం బాగుంటుందని, అందు మన సీఎం రైతాంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతున్నారని చెప్పారు. అలాగే ఆసరా పెన్షన్‌, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్‌ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ఎన్నో పథకాలను తెచ్చి రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ఆయనదే అన్నారు. రాబోయే రోజుల్లో మరోసారి బీఆర్‌‌ఎస్‌కు మద్దతు తెలిపి తెలంగాణను మరింత డెవలప్‌ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వడ్డేపల్లి మల్లారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, జడ్పీ వైస్‌ చైర్‌‌పర్సన్‌ భాగ్యలక్ష్మి అంజయ్య, ఎంపీపీ నాగజ్యోతి కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.