కన్నుల పండువగా.... తెప్పోత్సవం.....డోలోత్సవం

కన్నుల పండువగా.... తెప్పోత్సవం.....డోలోత్సవం
  • హంస వాహనంలో విహరించిన స్వామివారు
  • ధర్మపురిలోకొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

ముద్ర ధర్మపురి: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురిలో బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం హోలీ పర్వదినం సందర్భంగా బ్రహ్మపుష్కరిణిలో యోగ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి తెప్పోత్సవం, డోలోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తెప్పోత్సవం సందర్భంగా బ్రహ్మపుష్కరిణికి రంగులు వేసి, విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. ఆలయం నుంచి స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను మేళతాళాలు, భక్తుల గోవిందనామస్మరణ మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చి కోనేరులో అందంగా అలంకరించిన హంసవాహనంలో ఐదు ప్రదక్షిణలు చేయించారు. భక్తులు అధికసంఖ్యలో వచ్చి తెప్పోత్సవాన్ని తిలకించారు. అనంతరం డోలోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి. భక్తులు క్యూలైన్లో స్వామివార్లను దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.