ముఖ్యమంత్రి కేసీఆర్ కు మహిళల ఉసురు తగులుతుంది

ముఖ్యమంత్రి కేసీఆర్ కు మహిళల ఉసురు తగులుతుంది

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపాటు

సత్తుపల్లి, ముద్ర: మాటలు చెప్పడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ దిట్ట అని త్వరలో ఎన్నికలు వస్తున్నాయని మరోసారి మోసం చేసేందుకు సంక్షేమ కార్యక్రమాలు కొత్తవి తెస్తున్నారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం సత్తుపల్లిలో శీనన్న నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమ్మేళనం లో ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చినప్పుడు రాష్ట్రం ధనికంగా ఉందని కెసిఆర్ పాలనలో ఐదు లక్షల కోట్ల అప్పులకు కూరుకపోయిందని పొంగులేటి విమర్శించారు. నాలుగున్నర సంవత్సరాలలో చేయని రుణమాఫీ మరో ఏడు నెలలో ప్రభుత్వం కాల పరిమతి ముగుస్తుందని ఈ సమయంలో రుణమాఫీ చేస్తాననడం ఎన్నికల స్టంట్ అని ఆరోపించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్సైజ్ ఆదాయం 8,000 కోట్లని తెలంగాణ ఏర్పడిన తర్వాత 40 వేల కోట్ల ఆదాయం పెరిగిందని ఇదే నా బంగారు తెలంగాణ అని ఖచ్చితంగా మహిళల ఉసురు కేసీఆర్ కి తగులుతుందని పొంగులేటి శాపనార్ధాలు పెట్టారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కెసిఆర్ ని ఇంటికి పంపించేందుకు ఓటర్లు రెడీగా ఉన్నారని పొంగులేటి జోష్యం చెప్పారు. ఈ సభలో ఇల్లందు జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మువ్వ విజయ్ బాబు, స్వర్ణకుమారి, వైరా మున్సిపల్ చైర్మన్ జైపాల్, రాజశేఖర్, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.