వ‌ర‌ల్డ్‌క‌ప్‌తో భార‌త ఆర్థిక వ్యవస్ధకు 22 వేల కోట్ల లాభం

వ‌ర‌ల్డ్‌క‌ప్‌తో భార‌త ఆర్థిక వ్యవస్ధకు 22 వేల కోట్ల లాభం

న్యూఢిల్లీ: ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ భార‌తీయ ఆర్థిక వ్యవస్ధకు భారీ ఊత‌మివ్వనున్నది. వ‌ర‌ల్డ్ క‌ప్ స‌మ‌యంలో సుమారు 22 వేల కోట్లు భార‌త ఆర్థిక వ్యవస్ధలోకి వ‌చ్చి చేరే అవ‌కాశాలు ఉన్నట్లు బ్యాంక్ ఆఫ్ బ‌రోడాకు చెందిన ఆర్థిక‌వేత్తలు  అంచ‌నా వేస్తున్నారు.  గురువారం  ప్రారంభ‌మైన ఈ టోర్నీ.. న‌వంబ‌ర్ 15 వ‌ర‌కు సాగ‌నున్నది. ఈ స‌మ‌యంలో దేశీయ‌, అంత‌ర్జాతీయ విజిట‌ర్స్ భారీ సంఖ్యలో ప్రయాణం చేయ‌నున్నారు. ప‌ది న‌గ‌రాల్లో మ్యాచ్‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. ఆ ప‌ట్టణాల్లో  ఉన్న హోట‌ల్ ఇండ‌స్ట్రీ భారీగా ఆదాయాన్ని ఆర్జించ‌నున్నది.  ఆర్ధిక‌వేత్తలు  జాహ్నవీ ప్రభాక‌ర్‌, ఆదితి గుప్తాలు ఈ అంచ‌నా వేశారు.  2011 త‌ర్వాత ఇండియాలో మ‌ళ్లీ వన్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీ జ‌రుగుతున్నది. ఇండియాలో ప్రస్తుతం  ఫెస్టివ‌ల్ సీజ‌న్ కావ‌డం వ‌ల్ల మ్యాచ్ నిర్వహణ‌కు క‌లిసి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. టీవీలు, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మ్యాచ్‌ల‌ను వీక్షించే ప్రేక్షకుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. 2019తో పోలిస్తే ఆ సంఖ్య భారీగా పెరుగ‌నున్నట్లు భావిస్తున్నారు. టీవీ, లైవ్ స్ట్రిమింగ్ ద్వారా సుమారు 12వేల కోట్లు ఆర్జించే అవ‌కాశాలు ఉన్నాయి. వ‌ర‌ల్డ్‌క‌ప్ టైంలో విమాన టికెట్లు, హోట‌ల్ రెంట్లు పెరిగాయి. ఇంకా స‌ర్వీస్ ఛార్జీల‌ను కూడా పెంచిన‌ట్లు తెలుస్తోంది. వ‌ర‌ల్డ్‌క‌ప్ వ‌ల్ల ద్రవ్యోల్పణం పెరిగే ఛాన్సు ఉంద‌ని నిపుణులు అంటున్నారు. అక్టోబ‌ర్‌, న‌వంబ‌ర్ మాసాల్లో ద్రవ్యోల్పణం 0.15 శాతం నుంచి 0.25 శాతానికి పెరిగే ప్రమాదం  ఉందంటున్నారు. టికెట్ల అమ్మకాలు , హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌పై జీఎస్టీ వ‌సూళ్లతో  ప‌న్ను రాబ‌డి పెరిగే అవ‌కాశాలు ఉన్నాయని ఆర్థిక‌వేత్తలు  అంటున్నారు.