జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం తేవాలి

జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం తేవాలి
  • మీడియా కమిషన్​ఏర్పాటు చేయాలి
  • అక్రెడిటెడ్ జర్నలిస్టులకు రైల్వే పాసులు ఇవ్వాలి
  • టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, ఐజేయూ జాతీయ కార్యదర్శి నరేందర్ రెడ్డి 
  • గవర్నర్​తమిళిసైకి వినతిపత్రం సమర్పించిన జర్నలిస్టు నేతలు
  • టీయూడబ్ల్యూజే ఆందోళన విజయవంతం


ముద్ర, హైదరాబాద్​: దేశంలోని మీడియా, జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం తెచ్చి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విరాహత్ అలీ, ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం వారి నేతృత్వంలో యూనియన్ ప్రతినిధి బృందం రాజ్ భవన్​లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అక్రెడిటెడ్ జర్నలిస్టులకు రైల్వే పాసులు జారీ చేయాలని ఈ సందర్భంగా వారు గవర్నర్​ను కోరారు. స్పందించిన గవర్నర్​విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. వినతిపత్రం ఇచ్చినవారిలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఎం.ఎ.మాజీద్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి కే.మహిపాల్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏ.రాజేశ్, తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్యతరహా పత్రికలు, మేగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యూసుఫ్ బాబు తదితరులు ఉన్నారు. 

మహాత్ముడికి ఘన నివాళి..

గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ లోని ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్ముడి విగ్రహానికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఐజేయూ డిమాండ్ల వినతి పత్రాన్ని అక్కడ ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐజేయూ చేపట్టిన దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని 122 కేంద్రాల్లో వేల మంది జర్నలిస్టులు వివిధ డిమాండ్లతో ధర్నాలు చేసినట్లు రెడ్డి తెలిపారు.
 
అంబేద్కర్ సర్కిల్ లో ధర్నా..

ట్యాంక్ బండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద టీయూడబ్ల్యూజే, హెచ్ యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ మీడియా సంస్థలు, జర్నలిస్టుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష్య సాధింపు ధోరణిని మానుకోవాలన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులను హరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. అలాగే జర్నలిస్టుల సౌకర్యాలను రద్దు చేసే చర్యలకు స్వస్తి పలకాలని విరాహత్ సూచించారు.

జర్నలిస్టుల భద్రత కోసం చట్టం తేవాలి..

జర్నలిస్టుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాలని ఐజేయూ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి కోరారు. దేశంలో మీడియా స్థితిగతులను అధ్యయనం చేయడానికి వెంటనే మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఈమేరకు పలు డిమాండ్లతో గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నామని పేర్కొన్నారు. కార్మిక చట్టాల కోడిఫికేషన్ పేరుతో రద్దు చేసిన వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ను పునరుద్ధరించాలని నరేందర్​రెడ్డి డిమాండ్ చేశారు. అనంతరం ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం.ఏ.మాజీద్  మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిలిపేసిన జర్నలిస్టుల రైల్వే పాసులను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో యూనియన్ నాయకులు కే.మహిపాల్ రెడ్డి, ఎ.రాజేశ్, షౌకత్ హమీద్, చారీ, శ్రీనివాస్ రెడ్డి, ప్రతిభ, గౌస్, అశోక్, వెంకటయ్య, జర్నలిస్టులు పాల్గొన్నారు.