గృహలక్ష్మి పట్టాల పంపిణీలో గందరగోళం..
![గృహలక్ష్మి పట్టాల పంపిణీలో గందరగోళం..](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_651e75b5662e7.jpg)
- నిలిచిన బతుకమ్మ చీరల పంపిణీ..
ముద్ర, గంభీరావుపేట :గృహలక్ష్మి లబ్దిదారుల జాబితాలో అర్హులు పేరు లేక పోవడంతో అర్జీదార్లు ఆందోళనకు దిగారు. అనహర్హులకు కేటాయించారని ఆందోళన చేయడంతో పట్టాల పంపిణీ గందరగోళంగా మారింది. దీంతో బతుకమ్మ చీరల పంపిణీ కూడా నిలిచిపోయింది. గంభీరావుపేట మండల కేంద్రంలోనీ ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో గృహలక్ష్మి పట్టాల, బతుకమ్మ చీరల పంపిణీ ఎంపీపీ కరుణ అధ్యక్షతన నిర్వహించారు. గృహలక్ష్మి లో పారదర్శకత పాటించకుండా అర్హత ఉన్నవారికి అన్యాయం చేస్తున్నారని అవేదన వ్యక్తం చేసారు. ఏండ్ల తరబడి కిరాయి ఉంటున్నామని, ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం సాయం అందిస్తాదని ఆశ పడ్డామని, అన్ని అర్హతలు ఉన్న గృహలక్ష్మి రాలేదని , వారికీ తెలిసి ఉన్న వారికే గృహలక్ష్మి మంజూరు చేశారని ఆరోపించారు. దీంతో చేసేది ఏమీ లేక చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా అధికారులు నిలిపివేశారు. గృహలక్ష్మి అర్జీదారుల ఆందోళనకు బిజెపి ఎంపీటీసీ రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీటీసీ పర్శరాములు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులు కాకుండా అన్హరులకు ఏ విధంగా పంపిణీ చేస్తారని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాక, గృహలక్ష్మి రాక పెద్దవారి సొంతింటి కల కలగానే మిగులుతుందని అన్నారు. కేవలం ఒకరిద్దరికి మాత్రమే పథకాలు వర్తింపజేసి ముగిస్తున్నారని, ఇది కేవలం ఎన్నికల స్టంటేనని, పేద ప్రజలపై ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ వెంటనే జోక్యం చేసుకొని అర్హులైన పేదలకు గృహలక్ష్మి మంజూరు చేసి సొంతింటి కలను సహకారం చేయాలని డిమాండ్ చేశారు.