నా సమాధి తవ్వాలని కాంగ్రెస్‌ కలలు కంటోంది

నా సమాధి తవ్వాలని కాంగ్రెస్‌ కలలు కంటోంది

బెంగళూరు: తనకు గోతులు తవ్వాలని కాంగ్రెస్‌  కలలు కంటోందని.. తాను మాత్రం దేశాభివృద్ధి, పేదల వికాసంలో నిమగ్నమై ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ  వ్యాఖ్యానించారు.  కర్ణాటకలోని మాండ్య జిల్లాలో బెంగళూరు- మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను ఆదివారం ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తూ.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్‌ పార్టీ రూ.వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు.  'దేశాభివృద్ధికి, ప్రజల అభ్యున్నతికి డబుల్ ఇంజిన్ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్, ఇతర పార్టీలు ఏం చేస్తున్నాయి? మోదీకి సమాధి తవ్వాలని కాంగ్రెస్ కలలు కంటోంది. కానీ, దేశ ప్రజల ఆశీర్వాదం నాకు రక్షణ కవచంగా పనిచేస్తుందని వారికి తెలియదు. మోదీకి గోతులు తవ్వాలనే కలలు కనడంలో వారు(కాంగ్రెస్ నేతలు) బిజీగా ఉన్నారు. మరోవైపు.. బెంగళూరు- మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించడంలో, పేదల జీవితాలను బాగుపరచడంలో నేను బిజీగా ఉన్నా'నని ప్రధాని మోదీ పేర్కొన్నారు.