ఇసుక లారీలను అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు..

ఇసుక లారీలను అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు..
  • ఎన్జీటి ఉత్తర్వులను, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని  రాస్తారోకో..
  • రేపటి నుండి ఇసుక క్వారీ వద్ద మానేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే దీక్షలు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలకేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇసుక లారీలను అడ్డుకున్నారు.  ఎన్జీటి ఉత్తర్వులను, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేశారు. రేపటి నుండి ఇసుక క్వారీ వద్ద మానేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ కోటగిరి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జిటి) ఆదేశాలను జిల్లా కలెక్టర్ అమలు పరచాలని కోరుతూ గురువారం రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని మాట్లాడుతూ అధికార యంత్రాంగం అండదండలతో ఇసుక మాఫియా జోరుగా సాగుతోందని విమర్శించారు.

టేకుమట్ల మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు ఇళ్లు నిర్మించుకునేందుకు ఒకటి, రెండు ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక తీసుకునేందుకు అనుమతి ఇవ్వని ప్రభుత్వ అధికారులు, నిత్యం వందలాది లారీలల్లో మాత్రం ఇసుక తీసుకుపోవడానికి అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించారు.  భూపాలపల్లి జిల్లాలో డీసిల్టేషన్ పేరుతో నడుస్తున్న అక్రమ ఇసుక క్వారీలను రద్దు చేయాలని, జాతీయ హరిత ట్రిబ్యునల్  మే 31న మధ్యంతర ఉత్తర్వుల ద్వారా జిల్లా కలెక్టర్ ను ఆదేశించినప్పటికీ అక్రమ ఇసుక రవాణాను నిరోధించడానికి అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టనందున  నేడు స్థానిక ప్రజలు ఇసుక లారీలను నిలిపివేసి తమ నిరసనను తెలియజేస్తున్నట్లు చెప్పారు. 

చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ లో దాఖలైన పిటిషన్ సంఖ్య 68/2023 లో  మే 31న మద్యంతర ఉత్తర్వులనిస్తూ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ డీసిల్టేషన్ పేరుతో మానేరు, గోదావరి నదులలో 14 చోట్ల ఇసుక రీచ్ ల ఏర్పాటుకు  అనుమతించిన ప్రొసీడింగ్స్ రద్దు చేసిందని తెలిపారు. ఇసుక క్వారీలను వెంటనే నిలిపి వేయుటకు జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టాలని, లేనియెడల వారిపై చర్యలు తీసుకోబడునని ఎన్జీటీ హెచ్చరించినప్పటికీ, ఇసుక మాఫియా ప్రలోభాలకు లోనైన జిల్లా కలెక్టర్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఫైర్ అయ్యారు. తాము ఎన్జిటి ఉత్తర్వుల కాపీతో సహా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన కరువైనందునే, అనివార్యంగా ఇసుక లారీల నిలిపివేతకు పూనుకున్నామని తెలిపారు. ఇప్పటికైనా న్యాయస్థానం ఉత్తర్వులను గౌరవిస్తూ, రైతుల ఇసుక త్రవ్వకాలను నిలిపివేయాలని కోరారు. టేకుమట్ల, చిట్యాల మండలాల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తూ వాగులను బొందలగడ్డగా మారుస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోటగిరి సతీష్ మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణా నిలిపి వేయుటకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. రేపటి నుండి టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి ఇసుక క్వారీ దగ్గర మానేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే రిలే దీక్షలలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి వైనాల రవీందర్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బండ శ్రీకాంత్,  మండల ఉపాధ్యక్షుడు మాదం కొమురయ్య, మండల ప్రధాన కార్యదర్శులు దాసారపు సదానందం, పొన్నం సాంబయ్య, గోనపల్లి సంపత్, మండల కోశాధికారి శాస్త్రాల కిరణ్, ఓబీసీ సెల్ మండల అధ్యక్షుడు తోడేటి కుమార్, మండల నాయకులు మంద నరేందర్, బొల్లికొండ చిన్న రాజయ్య, అచ్చ స్వామి, అనవేణి మొగిలి, శాస్త్రాల సుధాకర్ లతో పాటు గ్రామ శాఖ అధ్యక్షులు అల్లం ఓదెలు, పంజాల రవి, గోనే శ్రీనివాసరావు, చిట్యాల శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు రెడ్డి రాజుల రాజు,  తదితరులు పాల్గొన్నారు.