జిల్లా ఎన్నికల మీడియా సెంటర్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా

జిల్లా ఎన్నికల మీడియా సెంటర్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ముద్ర ప్రతినిధి, మెదక్:రాష్ట్ర శాసనసభ ఎన్నికలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా,  ఎస్పీ రోహిణి ప్రియ దర్శిని ,అదనపు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లుతో బుధవారం పరిశీలించారు. మీడియా సెంటర్ లో  ఉన్న సదుపాయాలను, ఎంసిఎంసి పనితీరుకు సంబంధించిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్  ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎంసిఎంసి సెల్ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, ప్రచురణ, ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలను ప్రసారం చేయడం, సంబంధిత అభ్యర్థి ప్రచార వ్యయంలో వాటిని లెక్కించడం, సోషల్ మీడియాలో అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రకటనలకు వంటివి సకాలంలో ఆమోదిస్తూ, మంజూరు చేయాలని సూచించారు. షాటిలైట్ ఛానెల్స్ లో వచ్చే వార్తలను పూర్తిస్థాయిలో రికార్డు చేయాలని అన్నారు. వార్తా పత్రికలు, ఈ-పేపర్‌లు, టెలివిజన్ ఛానెల్‌లు, స్థానిక కేబుల్ నెట్‌వర్క్లు, సోషల్ మీడియా, మూవీ హౌస్‌లు, సంక్షిప్త సందేశాలు, ఇతర ఆడియో, వీడియో విజువల్ మీడియాలతో సహా ప్రకటనలను ఎంసిఎంసి నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే విడుదల చేయాలని  కలెక్టర్ వెల్లడించారు.సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టిసారించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.  ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించదానికి మీడియా పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు.