భావ స్వేచ్ఛకు విఘాతం కలిగించొద్దు
హైదరాబాద్ ముద్ర: సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలను ప్రచురించి .. వాటిని తొలగించేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లేదా మరేదైనా ఏజెన్సీని నియమించడాన్ని ఐజేయు తప్పు పట్టింది. ఈ మేరకు ఐటీ చట్టాల్లో మార్పులు తేవడానికి అత్యవసర రోజుల్లో విధించిన సెన్సార్ షిప్ నకు సమానమని అభిప్రాయపడింది. ఇలాంటి చర్యలకు పూనుకో రాదని పార్లమెంట్ సభ్యులకు బహిరంగ లేఖ రాసింది.
సామాజిక మాధ్యమాల్లో ఒక్కొక్కసారి తప్పుడు సమాచారం ప్రచారమవుతోందని .. అలాంటి వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని తాము కూడా అంగీకరిస్తున్నామని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ( ఐజేయు) అధ్యక్షుడు కే శ్రీనివాస్ రెడ్డి , సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్ జెమ్ము ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉచిత సమాచార ప్రవాహానికి ఆటంకం కలిగించేలా.. ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలకు వ్యతిరేకంగా జరిగే ప్రక్రియను తాము తప్పు పడుతున్నామని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రజాస్వామ్య ధోరణిలో పోవాలని సూచిస్తున్నామన్నారు.