సిటీ రోడ్స్ పై డబుల్ డెక్కర్ బస్సులు
![సిటీ రోడ్స్ పై డబుల్ డెక్కర్ బస్సులు](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63e344016e96a.jpg)
హైదరాబాద్, ఫిబ్రవరి 8: ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఠక్కున గుర్తొచ్చే వాటిలో చార్మినార్, బిర్లామందిర్, జూపార్క్ ఎంత ఫేమసో.. డబుల్ డెక్కర్ బస్సులు కూడా అంతే ఫేమస్. పట్నం వచ్చిన వారు కచ్చితంగా డబుల్ డెక్కర్ బస్సులు ఎక్కాలని ఆశపడే వాళ్లు. చిన్నారుల నుంచి పెద్దల వరకు డబుల్ డెక్కర్ బస్సులో నగరంలో తిరిగే వాళ్లు. అయితే కాలక్రమేణా నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు పూర్తిగా కనుమరుగయ్యాయి. బస్సులు మెయింటేనెన్స్ తదితర కారణాలలో అప్పటి ఏపీఎస్ ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సులను నిలిపివేసింది.అయితే తాజాగా హైదరాబాద్లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు రోడ్డెక్కాయి. గతంలో ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేస్తూ హైదరాబాద్లో డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టాలని కోరగా దానికి కేటీఆర్ స్పందిస్తూ త్వరలోనే తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇచ్చిన మాట మేరకు ఎట్టకేలకు డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొచ్చారు. ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సీ ఎస్ శాంతి కుమారి, ఎంపి రంజిత్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ పాల్గొన్నారు.ఫార్ములా ఈ ట్రాక్ దగ్గర ఈ నెల 11 వరకు ట్యాంక్ బండ్ చుట్టూ తిరగ నున్న బస్సులు. ఆ తర్వాత టూరిజం బస్సులుగా సిటీలో తిరగనున్న ఆరు డబుల్ డెక్కర్ బస్సులు. ప్రస్తుతం డబుల్ డెక్కర్ బస్సులను కేవలం టూరిజానికే పరిమితం చేశారు. అయితే సాధారణ ప్రయాణికులకు ఈ బస్సులను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారన్నదానిపై స్పష్టత రాలేదు. ఆరు బస్సులు ఆర్డర్ ఇవ్వగా మూడు రెడీ అయ్యాయి. త్వరలో మరో మూడు డబుల్ డెక్కర్ బస్సులు కొనుగోలు చేయనున్నారు. మొత్తం 20 డబుల్ డెక్కర్ బస్సులు కొనుగోలు చేయాలని HMDA ప్లానింగ్ చేస్తోంది. 2.16 కోట్ల వ్యయం తోఒక్కో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు కొనుగోలు చేయనున్నారు.