రేవంత్​పై దాడి గండ్ర పనే

రేవంత్​పై దాడి గండ్ర పనే

హైదరాబాద్: భూపాలపల్లిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  పాదయాత్రపై దాడిని మాజీ ఎంపీ వీ.హనుమంతరావు  తీవ్రంగా ఖండించారు.  బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు సభలు పెట్టొద్దు అంటే ఎలా అని ప్రశ్నించారు. కేసీఆర్  దగ్గర మెప్పు పొందడానికి గండ్ర వెంకటరమణారెడ్డి  దాడి చేయించారని ఆరోపించారు.

బీఆర్ఎస్  ఇతర రాష్ట్రాల్లో మీటింగ్‌లు పెడితే ఇలాగే కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేస్తే కేసీఆర్  ఒప్పుకుంటారా అని నిలదీశారు. రాళ్లు రువ్వడం, టమాటాలు వేయడం సరైన పద్దతి కాదన్నారు. ఇలాంటి చర్యలు మానుకోక పోతే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య వస్తుందని తెలిపారు. పార్టీ మారిన గండ్ర వెంకటరమణారెడ్డిపై ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని ఆయన హెచ్చరించారు.  పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడడం మొదలైతే బీఆర్ఎస్ తట్టుకోలేదన్నారు.