అనంతనాగ్ లో కొనసాగుతున్న కాల్పులు
- ఇద్దరు ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా బలగాలు
అనంతనాగ్: అనంతనాగ్లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో ఆర్మీ, పోలీసుకు చెందిన ముగ్గురు అధికారులు వీర మరణం పొందారు. మేజర్, డీఎస్పీ, పోలీసు అధికారి మృతిచెందడంతో ఆర్మీ అధికారులు అప్రమత్తమయ్యారు. కోకెర్నాగ్లో గాడోల్లో ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందడంతో అక్కడకి వెళ్లారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. అక్కడ భారీ కాల్పులు, పేలుళ్లు జరుగుతున్నాయి. సైన్యం, స్థానిక పోలీసులతో సహా భద్రతా బలగాలు మొత్తం ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి చిన్న క్వాడ్కాప్టర్లు, పెద్ద డ్రోన్లను రంగంలోకి దింపారు. చినార్ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన విక్టర్ ఫోర్స్ కమాండర్ మేజర్ జనరల్ బల్బీర్ సింగ్ ఇప్పటికే ఎన్కౌంటర్ ప్రదేశాన్ని సందర్శించి ఆపరేషన్లో పాల్గొంటున్న సైనికులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆదేశాలిస్తే తాము పాక్నుంచి వచ్చే ఉగ్రవాదులను మట్టు పెడతామని ఆర్మీ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సూచించారు. ఈ యేడాది జనవరి నుంచి జమ్మూకశ్మీర్లో 40 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఎనిమిది మంది మాత్రమే స్థానికులు కాగా, మిగిలిన వారంతా విదేశీయులు.