బీజేపీ కుట్రలను తిప్పి కొట్టారు-టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
![బీజేపీ కుట్రలను తిప్పి కొట్టారు-టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_645f35045b461.jpg)
కర్ణాటకలో బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కర్ణాటక ఫలితాలు వస్తున్న నేపథ్యంలో ఆయన నిలోఫర్ టెంపుల్లో పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో కాంగ్రెస్ వైపు స్పష్టమైన తీర్పు ఇస్తున్నారని, శ్రీరాముణ్ణి అడ్డుపెట్టుకుని పార్టీ విస్తరించాలనుకోవడం బీజేపీ మానుకోవాలన్నారు.
కర్ణాటకలో భజరంగ్ బలిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూశారని, శ్రీరాముణ్ణి అవమానించిన వారిని భజరంగబలి ఆశీర్వదించడని, కర్ణాటకలో బీజేపీ ఓడించి మోడీని, జేడీఎస్ ను ఓడించి కేసీఆర్ ను తిరస్కరించారని రేవంత్ వ్యాఖ్యానించారు. కర్ణాటక తీర్పును కాంగ్రెస్ సాదరంగా స్వాగతిస్తున్నామని, దేశంలో ఇవే ఫలితాలు రాబోతున్నాయని, తెలంగాణలోను స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఇక, ఎంఐఎం విధానాన్ని ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.