అకాల వర్షానికి తడిసిన ధాన్యం....
![అకాల వర్షానికి తడిసిన ధాన్యం....](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_6468cf094bf86.jpg)
- ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతుల రాస్తారోకో...
- ప్రధాన రహదారిపై నిలిచిన వాహనాలు
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల మండలం చలిగల్ వ్యవసాయ మార్కెట్లో శనివారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయింది. కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ రైతులు జగిత్యాల, నిజాంబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. సుమారు గంటపాటు రైతుల నిరసన కొనసాగగా ప్రధాన రహదారిపై ఇరువైపుల ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ ఆరిఫ్ అలీఖాన్ రైతుల వద్దకు వచ్చి వారికి నచ్చ చెప్పి ఆందోళన విరమింప చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం, బి జే పీ నాయకుడు పన్నాల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ కళ్ళల్లో ధాన్యం పోసి నెల రోజులు గడిచిన కొనుగోలు చేయడం లేదన్నారు. ఎండకు మ్యచర్ ఏడు శాతంకు పడిపోయిందని దీంతో తూకం తగ్గిపోతుందని అన్నారు.
అకాల వర్షాలతో నష్టపోగా ఇటు నెల రోజులైనా కొనుగోలు చేయకపోవడంతో తూకం తగ్గుతుంది అన్నారు. ధాన్యం కొనుగోలు జపంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసలు ధాన్యాన్ని కొంటుంది మిల్లర్ల ప్రభుత్వమా అని ప్రశ్నించారు. మిల్లర్లు 8 నుంచి 10 కిలోలు అధికంగా జోకుతున్నారని ఎన్ని మార్లు చెప్పిన అధికారులు స్పందించడం లేదన్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క మిల్లర్ పైన చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. టార్పాలిన్లు, కవర్ల కొరత ఉందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, పలువురు రైతులు పాల్గొన్నారు.