టెన్త్​ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో  ఏపీ మాజీ మంత్రి నారాయణపై విచారణ

టెన్త్​ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో  ఏపీ మాజీ మంత్రి నారాయణపై విచారణ

ఢిల్లీ: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో  ఏపీ మాజీ మంత్రి నారాయణ  దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.  పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం.. దీనిపై సెషన్స్‌ కోర్టులోనే విచారణ చేపట్టాలని ఆదేశించింది. మెరిట్‌ ఆధారంగానే విచారణ కొనసాగించాలని సూచించింది. సెషన్స్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై వారం రోజుల్లో హైకోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించింది. అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంటూ.. పిటిషన్‌పై విచారణను ధర్మాసనం ముగించింది.

 గత ఏడాది ఏప్రిల్‌ 27న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని జడ్పీ హైస్కూల్‌ నుంచి పదోతరగతి ప్రశ్నపత్రం లీకైంది. వాట్సాప్‌ ద్వారా తెలుగు ప్రశ్నపత్రం బయటకు రావడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నారాయణ పాత్ర ఉన్నట్లు అప్పట్లో చిత్తూరు పోలీసులు వెల్లడించారు. నారాయణ విద్యాసంస్థల అధినేతగా 2014లోనే నారాయణ వైదొలిగారంటూ ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ కేసుపై గత కొన్ని నెలలుగా జిల్లా కోర్టు, హైకోర్టుల్లోనూ విచారణ జరిగింది. ఇటీవల నారాయణ బెయిల్‌ను హైకోర్టు రద్దు చేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.