తెలంగాణలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు
ముద్ర,తెలంగాణ:-తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇవాళ్టి నుంచి మార్చి 19 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి మొత్తం 9,80,978 మంది పరీక్షలు రాస్తున్నారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4,78,718 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 5,02,260 మంది పరీక్షలకు హాజరయ్యారు.
పరీక్షల కోసం అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 1,521 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు నిమిషం ఆలస్యంగా వచ్చినా అధికారులు అనుమతించడంలేదు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.