జేడీఎస్ యూ టర్న్
![జేడీఎస్ యూ టర్న్](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_645f6313a2963.jpg)
- తమనెవరూ సంప్రదించలేదన్న కుమారస్వామి
- మరింత పెరుగుతున్న కాంగ్రెస్ అధిపత్యం
కర్ణాటక రాజకీయాల్లో జేడీఎస్ అంతర్మథనంలో పడింది. ముందుగా బీజేపీతో చర్చలు పెట్టిన ఆ పార్టీ చీఫ్.. తాజాగా మాట మార్చారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలే వస్తాయని తాము ఆశిస్తున్నామని, ప్రభుత్వం ఏర్పాటు వ్యవహారంపై ఇంకా ఎవరూ సంప్రదించలేదని జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుండగానే బీజేపీ ఆధిపత్య రాజకీయాలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ మెజార్టీ తేలకముందే జేడీఎస్తో సంప్రదింపులు స్టార్ట్ చేసింది. ఇదే సమయంలో కాంగ్రెస్ కూడా ఢిల్లీలో ఇదే ప్లాన్ మొదలుపెట్టింది. దేవగౌడతో చర్చలకు కేసీ వేణుగోపాల్ సిద్ధమయ్యారు. కానీ, ఇదే సమయంలో కాంగ్రెస్ దూకుడు పెరిగింది.
మేజిక్ ఫిగర్ దాటడమే కాదు.. ఇంకా ఎక్కువ స్థానాల్లో ముందు నిలిచింది. మధ్యాహ్నం 1 గంట వరకు 133 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఏర్పాటు వ్యవహారంపై ఇంకా ఎవరూ సంప్రదించలేదని జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి చెప్పారు. దీనికి ముందు, బెంగళూరులోని ఓ ఆలయాన్ని కుమారస్వామి దర్శించి పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్క్కు చేరువ వరకూ వస్తుందని, జేడీఎస్ 30 నుంచి 32 సీట్లు సీట్లు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంపై మాట్లాడుతూ, తమది చిన్న పార్టీ అని, తనకు అంతగా డిమాండ్ ఉండకపోవచ్చని, మంచి పరిణామాలు చోటుచేసుకుంటాయని ఆశిస్తున్నానని చెప్పారు. ఫలితాలు వచ్చాక మరోసారి మాట్లాడుకోవచ్చని అన్నారు.