మట్టి రోడ్లు లేని నగరంగా కరీంనగర్

మట్టి రోడ్లు లేని నగరంగా కరీంనగర్
  • 157 కోట్ల పనులకు టెండర్ 
  • ఆగస్టు చివరి వారంలో మానేరు రివర్ ఫ్రంట్ మొదటి దశ పనులకు శ్రీకారం: రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్:  మట్టి రోడ్డు లేని నగరంగా కరీంనగర్ కార్పొరేషన్ ను తీర్చిదిద్దుతామని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం మంత్రి మీసేవ కార్యాలయంలో నగర మేయర్ వై సునీల్ రావు తో కలసి మంత్రి  మీడియాతో మాట్లాడారు.  ప్రజలు అబ్బురపడే విధంగా నగరంలో అభివృద్ధి కొనసాగుతుందని ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయం చేస్తామని మిగతా సమయంలో తమ ధ్యాస అంత అభివృద్ధి పైనే ఉంటుందన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా  నిరంతరం నగర అభివృద్ధి కోసం పాటుపడుతున్నామని మంత్రి అన్నారు. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని వెల్లడించారు. నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్  సహకారంతో రానున్న రోజుల్లో మట్టి రోడ్డు లేని కరీంనగర్ కార్పొరేషన్ ను తీర్చిదిద్దుతామని వెల్లడించారు. 

కరీంనగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని  కార్పొరేషన్ పరిధిలో ముఖ్యమంత్రి హామీ నిధులు 132 కోట్లు కరీంనగర్ రూరల్ లో 25 కోట్ల పనులకు టెండర్లు పిలిచామని ఆగస్టు 15 నుండి పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. పార్టీలకతీతంగా నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లో అభివృద్ధిపనులు కొనసాగుతున్నాయని శివారు కాలనీల్లోని లింకు రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. నగరంలో ఇప్పటికే ప్రధాన చౌరస్తాలలో ఐలాండ్ లు నిర్మించామని, మిగిలి ఉన్న ఐలాండ్ నిర్మాణ పనులు త్వరగానే పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ పున్నమి అనిల్ గౌడ్, బారాసా నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, భూమా గౌడ్, ఐలేందర్, యాదవ్ యూత్ అధ్యక్షులు కుల్దీప్ వర్మ, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.