సమరానికి ఇక సై 

సమరానికి ఇక సై 
  • ప్రచారంలో  గులాబీ పార్టీ దూకుడు 
  • 26 నుంచి మలివిడత  ఎన్నికల ప్రచారం  
  • ప్రారంభించనున్న  ముఖ్యమంత్రి  కేసీఆర్
  • రోజుకు రెండు, మూడు సభలకు హాజరయ్యేలా ప్రణాళికలు
  • ప్రచార షెడ్యూల్ లో స్వల్పమార్పులు
  • నవంబర్​ 9 న నామినేషన్లు వేయనున్న సీఎం 

ముద్ర, తెలంగాణ బ్యూరో :ఎన్నికల ప్రచారంలో  అధికార పార్టీ  మరింతగా దూకుడుగా వెళుతోంది.  ఇప్పటికే మొదటి విడత ప్రచారాన్ని పూర్తి చేసిన ఆ పార్టీ అధినేత,  ముఖ్యమంత్రి కేసీఆర్  ఈ నెల 26 నుంచి మలివిడత ప్రచారానికి సిద్ధమవుతున్నారు. మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుని  హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది.  ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తోంది.  రోజు రెండు లేదా మూడు సభల్లో కేసీఆర్ పాల్గొనే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఈ  విడతలో  సుమారు 30కి పైగా సభల్లో కేసీఆర్ పాల్గొనున్నారు. కాగా ఈ నెల 26, 27 తేదీలలో నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటన షెడ్యూల్ లో మార్పులు జరిగాయి.  వాస్తవానికి  26న అచ్చంపేట,  నాగర్‌కర్నూలు,  మునుగోడులో ఆయన పర్యటించాల్సి ఉంది.  కానీ ఆ రోజు బీఆర్ఎస్ అధినేత అచ్చంపేట, వనపర్తి, మునుగోడు సభలలో పాల్గొననున్నారు. ఇక నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో కేసీఆర్ పర్యటన లేదని పార్టీ స్పష్టం చేసింది. 

అలాగే షెడ్యూల్ ప్రకారం 27న పాలేరు, స్టేషన్‌ ఘన్‌పూర్ లలో  ఆయన పర్యటించాల్సి ఉండగా.. పాలేరు, మహబూబాబాద్,  వర్దన్నపేట కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సభలలో పాల్గొని ప్రసంగించనున్నారు. స్టేషన్ ఘన్ పూర్ లో వివాదం సద్దుమణగడంతో  అక్కడ బదులుగా మహబూబాబాద్ తో  పాటు వర్దన్నపేటలో  బీఆర్ఎస్ సభ ఏర్పాటు చేస్తోంది.  29న కోదాడ, తుంగతుర్తి, ఆలేరులో ఎన్నికల సభల్లో కేసీఆర్ ప్రసంగించనున్నారు.  30న జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్‌లో జరిగే సభల్లో  పాల్గొంటారు.  31న హుజూర్‌నగర్, మిర్యాలగూడ,  దేవరకొండలో నవంబర్ 1న సత్తుపల్లి, ఇల్లందులలో ప్రచారంలో పాల్గొంటారు. నవంబర్ 2న నిర్మల్, బాల్కొండ, ధర్మపురిలో బీఆర్ఎస్ ఎన్నికల సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.  నవంబర్ 3వ తేదీన ముథోల్, ఆర్మూర్‌,  కోరుట్ల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. నవంబర్ 5న కొత్తగూడెం, ఖమ్మంలలో,  నవంబర్ 6న గద్వాల్, మక్తల్, నారాయణపేట్, నవంబర్ 7న చెన్నూరు, మంథని, పెద్దపల్లి, నవంబర్ 8న సిర్పూర్, అసిఫాబాద్, బెల్లంపల్లిలలో కేసీఆర్.. బీఆర్ఎస్ సభల్లో పాల్గొని పార్టీ అభ్యర్థుల తరపున  ప్రచారం నిర్వహించనున్నారు.
  
9న రెండుచోట్ల నామినేషన్లు 
సీఎం కేసీఆర్‌ ఈ ఎన్నికల్లో గజ్వేల్‌, కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నవంబర్‌ 9న ఒకేరోజు ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేస్తారు. ఆనవాయితీ ప్రకారం 9న ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గజ్వేల్‌లో మొదటి నామినేషన్‌,  మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండో నామినేషన్‌ దాఖలు చేస్తారు. 4 గంటలకు కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.