గిర్ని తండాలో మోహరించిన పోలీసు బలగాలు

గిర్ని తండాలో మోహరించిన పోలీసు బలగాలు

మెడికో ప్రీతి మృతితో వరంగల్‌లోని గిర్ని తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీస్‌ బందోబస్తు మధ్య కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఆందోళనల నేపథ్యంలో ప్రత్యేక పోలీసు బలగాలతో గిర్ని తండాను మోహరించారు. మరోవైపు ప్రీతి పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నారు కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో ప్రీతి తండ్రి, సోదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నా కూతురు ప్రీతిది ముమ్మాటికీ హత్యే’ అంటూ ఆమె తండ్రి నరేందర్ పేర్కొన్నారు. తన కూతురుకి ఇంజక్షన్ ఇచ్చి సైఫ్ చంపేశాడని ఆరోపించారని, అధికారులు వెంటనే స్పందించి ఉంటే తన కూతురు బతికేదని కన్నీటి పర్యంతమయ్యారు ప్రీతి తండ్రి. నరేందర్ వ్యాఖ్యలు అనంతరం ప్రీతి సోదరి కూడా సంచలన ఆరోపణలు చేశారు. ‘ప్రీతిది వందశాతం హత్యే. సైఫ్ ఒక్కడే కాదు ఇంకా కొందరి ప్రమేయం కూడా ఉంది. ప్రీతి తనకు తానుగా మత్తు ఇంజక్షన్‌ తీసుకోలేదు. కొందరు పట్టుకుంటే, సైఫ్ ఇంజక్షన్ చేశాడు. నలుగుర్ని ఎదురించే బలం కూడా ప్రీతికి లేద’ని ఆమె సోదరి ఆరోపించారు. కాగా, ప్రీతి మరణం తర్వాత విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ నిర్వాహకులు అలర్ట్ అయ్యారు.