దిల్లీలో ఎమ్మెల్సీ కవిత దీక్షకు పోలీసుల ఆంక్షలు

దిల్లీలో ఎమ్మెల్సీ కవిత దీక్షకు పోలీసుల ఆంక్షలు

దిల్లీ: చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్‌ బిల్లు తీసుకురావాలనే డిమాండ్‌తో భారత్‌ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన నిరసన దీక్షకు దిల్లీ పోలీసులు ఆంక్షలు విధించారు. శుక్రవారం దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద దీక్షకు భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అదే రోజు బీజేపీ ధర్నా కూడా ఉన్నందున, అనుమతిచ్చిన ప్రదేశంలో సగం ప్రాంతంలోనే ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసులు చెప్పారని కవిత తెలిపారు.  జంతర్‌మంతర్‌ వద్ద దీక్ష ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన కవిత మీడియాతో మాట్లాడుతూ... ఉన్నట్టుండి  బీజేపీ ధర్నా ఏంటని ప్రశ్నించారు.

భారత జాగృతి సమితి ఆధ్వర్యంలో సుమారు 5వేల మందితో దీక్ష చేస్తామని ముందుగానే దిల్లీ పోలీసులకు సమాచారమిచ్చామని, అందుకు అంగీకరించారని స్పష్టం చేశారు. దీక్షకు ఒక రోజు ముందు సగం ప్రాంతంలోనే ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పడం భావ్యం కాదన్నారు. దిల్లీ పోలీసులు ఆంక్షలు విధించడం సరికాదని, దీక్షకు వారు సహకరిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. తమ దీక్షలో మార్పు లేదని.. యథావిధిగా నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.