విధుల పట్ల పోలీసులు అంకితభావంతో పనిచేయాలి
![విధుల పట్ల పోలీసులు అంకితభావంతో పనిచేయాలి](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_64788d6e1e837.jpg)
జిల్లా ఎస్.పి శ్రీమతి రక్షిత కె. మూర్తి
ముద్ర ప్రతినిధి, వనపర్తి: విధుల పట్ల పోలీసులు అంకితభావంతో పని చేయాలని జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా అమరచింత పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నందు రికార్డ్స్, క్రైమ్ ఫైల్స్ తనిఖీ చేసి, తగు సూచనలు జారీ చేశారు. గత మూడు సంవత్సర కాలంలో నమోదైన అన్ని కేసులను పరిశీలించి, ఆత్మకూర్ సీఐ, అమరచింత SI లకు సూచనలు చేశారు. మండలంలో ఉన్న రౌడీలు, అనుమానితుల యొక్క షీట్స్ తనిఖీ చేయడం జరిగింది. అనంతరం పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి ఎస్.ఐ.శివనాగేశ్వర్ నాయుడు జిల్లా ఎస్పీకి వివరించారు.
అనంతరం ఎస్పీ అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేస్తూ విధుల పట్ల అంకితభావంగా ఉండాలని, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. న్యాయబద్ధంగా చట్టాన్ని అమలు చేయడం పోలీసుల బాధ్యత అని, ముందుగా చట్టాలను స్వయంగా పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్నారు. పటిష్టంగా పెట్రోలింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు. నకిలీ విత్తనాలపై గట్టి నిఘా ఉంచాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి ప్రమాదాల నివారించడానికి కృషి చేయాలని తెలిపారు. ఆర్థిక నేరాలకు కట్టడి చేయడానికి సీసీ టీవీ కెమెరాలు అమర్చే విధంగా ప్రజలకు చైతన్య పరచాలి అని పేర్కొన్నారు. ప్రజలు ఎటువంటి సమాచారమైనా డయల్ - 100 ద్వారా తెలుపవచ్చు అని సూచించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. రాత్రి పెట్రోలింగ్ అధికారులు పాత నేరస్తులను తనిఖీ చేయాలని తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణ గురించి గ్రామాలలో మరియు ప్రజలకు ప్రజాప్రతినిధులకు యువకులకు గ్రామాల విపిఓలు, పోలీస్ అధికారులు, సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సి.ఐ.శ్రీ.రత్నం గారు, సిబ్బంది పాల్గొన్నారు.