ఏపీకి రూ.50 వేల కోట్ల ప్రాజెక్టు.. ఛాన్స్ కొడితే వేలాది ఉద్యోగాలు  

ఏపీకి రూ.50 వేల కోట్ల ప్రాజెక్టు.. ఛాన్స్ కొడితే వేలాది ఉద్యోగాలు   

న్యూఢిల్లీ: భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) రిఫైనరీ ఉత్పాదక సామర్థ్యం పెంపు ఆంధ్రప్రదేశ్ కు వరంగా పరిణమిల్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. తొలుత బీపీసీఎల్ ప్రైవేటీకరణకు కేంద్రప్రభుత్వం మొగ్గు చూపినా, తర్వాత ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకుని దీని కెపాసిటీని పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి వరంగా పరిణమించనున్నదనే వాదన వినిపిస్తోంది.

      భారత్ పెట్రోలియం కార్పొరేషన్ కు ముంబై, కొచ్చి, మధ్యప్రదేశ్ లో రిఫైనరీలు ఉన్నాయి. దేశంలోని తూర్పు లేదా పశ్చిమ తీర ప్రాంతాల్లో కొత్తగా మరో భారీ రిఫైనరీని ఏర్పాటు చేయాలన్నది తాజా ప్రతిపాదన. ఇందుకోసం 50 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు బీపీసీఎల్ సిద్ధంగా ఉంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో అనువైన స్థలం కోసం అన్వేషిస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోగలిగితే చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్రానికి వచ్చే మొదటి ప్రాజెక్టుగా ఇది మారే అవకాశం లేకపోలేదు.
    దేశంలో పెరుగుతున్న ఇంధన వనరుల అవసరాన్ని తీర్చేందుకు ఈ భారీ రిఫైనరీ ఏర్పాటు చేయాలని BPCL నిర్ణయించింది. ఏకంగా 12 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో దీన్ని నెలకొల్పాలని చూస్తోంది. 2029 నాటికి తన సామర్థ్యాన్ని 45 మిలియన్ మెట్రిక్ టన్నుల కు పెంచాలని చూస్తున్నట్లు కంపెనీ ఛైర్మన్ కృష్ణ కుమార్ ఇటీవల వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నట్లు సమాచారం. కానీ త్వరలోనే కార్యరూపం దాల్చవచ్చని తెలుస్తుంది. సంస్థ చైర్మన్ గతంలో చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఈ సమయంలో BPCL తన రిఫైనరీని APలో ఏర్పాటు చేసే విధంగా ఒప్పించగలిగితే రాష్ట్రంలో భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే చంద్రబాబునాయుడు సారథ్యంలోని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి దీనికి సంబంధించి ఒక లేఖను కూడా రాసినట్టుగా సమాచారం.