కోరుట్ల మండలం లో ఘోర రోడ్డు ప్రమాదం...ముగ్గురి మృతి

కోరుట్ల మండలం లో ఘోర రోడ్డు ప్రమాదం...ముగ్గురి మృతి

ముద్ర, కోరుట్ల: కోరుట్ల మండలం వెంకటాపూర్- మోహన్ రావు పేట గ్రామాల మధ్య జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మోటార్ సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో జగిత్యాల జిల్లా కొండగట్టు ముత్యంపేట కు చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే మల్యాల మండలం కొండగట్టు ముత్యంపేటకు చెందిన బడికల వేణుగోపాల్ 32 అనే వ్యక్తి మేస్త్రిగా పనిచేస్తున్నాడు. మెట్‌పల్లి లోని ఓ ఇంటి నిర్మాణం కు సంబందించి స్లాబ్ పనుల నిమిత్తం సెంట్రింగ్ పనిచేసే ముత్యంపేటకు చెందిన పసుపులేటి శ్రీకాంత్ 27, కొమరం వెంకటేష్ 33,లను తీసుకొని మోటార్ సైకిల్ పై ముగ్గురు కలిసి ఆదివారం ఉదయం సుమారు ఐధు గంటలకు కొండగట్టు నుంచి ముత్యంపేటకు బయలుదేరారు.

మార్గమధ్యలో కోరుట్ల మండలం మోహన్ రావు పేట- వెంకటాపూర్ శివార్లకు చేరుకునే సమయంలో ఈ ముగ్గురు వెళ్తున్న మోటార్ సైకిల్ ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్, వెంకటేశులు అక్కడికక్కడే చనిపోగా వేణును జగిత్యాల ప్రభుత్వా ఆసుపత్రిలో చికిత్స కోసం తరలించారు. ఆయన అక్కడ ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

శ్రీకాంత్ భార్య శిరీష ఏడు నెలల గర్భిణీ. కాగా వేణుగోపాల్ కు భార్య జ్యోతి ఎనిమిది, ఆరు, సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకటేష్ ఒంటరి వ్యక్తి. ప్రమాదం జరిగిన వెంటనే కోరుట్ల సీఐ సురేష్ బాబు, కోరుట్ల మేడిపల్లి ఎస్ఐలు కిరణ్, శ్యామ్ రాజ్, లు సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ రాజస్థాన్ కు చెందినదిగా గుర్తించారు. లారీని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మృతుల బంధువులతో కోరుట్ల, జగిత్యాల ప్రభుత్వాసుపత్రి వద్ద తీవ్ర విషాదం నెలకొంది.